కలెక్టర్ సిక్తా పట్నాయక్అధికారులతో సమీక్ష
ఎదులాపురం, జనవరి 19 : జిల్లాలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యం, పంచాయతీ, పోలీస్, మున్సిపల్, వార్డు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత వారం వైరస్ వ్యాప్తి సింగల్ డిజిట్లో ఉందని, ప్రస్తుతం డబుల్ డిజిట్గా మారి ఉధృతి చెందుతున్నదన్నారు. ప్రణాళికలతో ఈ వ్యాప్తిని ఆరికట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జన సమూహం గల ప్రాంతాలైన రైతు బజార్, శివాజీ చౌక్, గాంధీచౌక్ తదితర ప్రాంతాల్లో కొవిడ్పై విశ్లేషిస్తూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మైక్ సెట్ల ద్వారా వివరించాలన్నారు. ప్రతి దుకాణా సముదాయం, షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, వైన్స్, బార్లలో ‘నో మాస్క్ నో ఎంట్రీ’ బోర్టులను తప్పని సరిగా ప్రదర్శించాలని సూచించారు. జిల్లాలో మొదటి డోస్ 99.24 శాతం, రెండో డోస్ 74.42 శాతం పూర్తయిందని తెలిపారు. ఇంకా రెండో డోస్ అర్హత గల వారు 75 వేల మంది ఉన్నారన్నారు. అదన పు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు ఎస్పీ శ్రీనివాస్రావు, ఆర్టీవో రాజేశ్వర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో డాక్టర్ శ్రీకాంత్, డివిజనల్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.