బెల్లంపల్లిరూరల్, జనవరి 19: వరి పంటలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని నివారించకుంటే నష్టం వస్తుందని రైతులకు బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజేశ్వర్నాయక్ సూచించారు. బుధవారం బెల్లంపల్లి మండలంలోని పెర్కపల్లిలో క్షేత్ర సందర్శనలో భాగంగా వరి పంటలను డాక్టర్ రాజేశ్వర్నాయక్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో సల్ఫైడ్ దుష్ప్రభావం, జింకు లోపం, కాండం తొలుచు పురుగు ఉనికిని గుర్తించారు. మోతాదుకు మించి వాడుతున్న పాస్ఫారిక్ ఎరువుతో, సరైన మురుగునీటి వసతి లేని క్షేత్రాల్లో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించినట్లు తెలిపారు. సల్ఫైడ్ దుష్ప్రభావం వల్ల వరి మొక్క వేరు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మొక్క గిడుసు బారిపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. దీని నివారణకు ఆరుతడి పద్ధతిలో నీటిని అందించాలని సూచించారు. ప్రస్తుతం నమోదవుతున్న అల్ప ఉష్ణోగ్రతల కారణంగా జింకు లోపం నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి పంటకు పిచికారీ చేసుకోవాలని సూచించారు. పైరు దుబ్బ చేసే దశలో వచ్చే కాండం తొలిచే పురుగు నివారణకు నాటిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు క్లోరంట్రనిలిఫ్రోలే 0.4జీ 4కిలోల గుళికలు చల్లాలని సూచించారు. ఎకరానికి 4 నుంచి 8 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట శాస్త్రవేత్తలు డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ తిరుపతి పాల్గొన్నారు.