తుంతుంగ వాగు సమీపంలోని గ్రామాల ప్రజల కష్టాలు తీరుస్తాం
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
కోటపల్లి, జనవరి 19 : కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామం వద్ద తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో సమీపంలోని పది గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం అతి త్వరలోనే నెరవేరనుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామం సమీపంలోని తుంతుంగ వాగు పై రూ.8 కోట్ల నిధులతో నిర్మిస్తున్న తుంతుంగ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎదుల్లబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయని తెలిపారు. వర్షాకాలంలో ఈ గ్రామాల ప్రజలు వాగును దాటలేక పడుతున్న కష్టాలు చూడలేక ఈ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వెంటనే స్పందించిన ప్రజల కష్టాలను తీర్చేందుకు బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విప్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అజ్గర్ మొహియొద్దీన్, ఏఎంసీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, యూత్ ప్రెసిడెంట్ మారిశెట్టి విద్యాసాగర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్ రెడ్డి, సర్పంచ్ కొటారి నిర్మల, ఎంపీటీసీ జేక శేఖర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.