కార్యకర్తలే బలం.. బలగంగా భావించే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. వారి యోగక్షేమాలను భుజాలపై వేసుకున్నది. గులాబీ దళంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రీమియం మొత్తం చెల్లించి ప్రమాద బీమాతో భరోసానిస్తున్నది. దురదృష్టవశాత్తూ ఎవ్వరైనా చనిపోతే.. అతడి కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థికంగా ఆదుకుంటున్నది. ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా రూ. 2 లక్షల బీమా చెక్కును అందించడమేగాకుండా అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 126 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.2.52 కోట్లు పంపిణీ చేసి అండగా నిలిచింది. స్వార్థానికి వాడుకొని వదిలేసే మిగతా పార్టీల్లా కాకుండా.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆది నుంచీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తోంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఐదు లక్షల పై చిలుకు సభ్యత్వాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాలు, కండ్ల ముందు కనిపిస్తున్న ఫలాలువంటి వాటిని పరిగణలోకి తీసుకుంటున్న ప్రజలు.. స్వచ్ఛదంగా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. నిజానికి ఇతర పార్టీలేవీ సభ్యత్వం విషయంలో బీఆర్ఎస్ దరిదాపుల్లో కూడా లేవు. అంతేకాదు, ఇంత పెద్దమొత్తంలో కూడా ఏ పార్టీ గతంలో సభ్యత్వం నమోదు చేయలేదు. సభ్యత్వ నమోదును కూడా పకడ్బందీగా చేశారు. ఇతర పార్టీల మాదిరి కాకుండా పూర్తి వివరాలతో కంప్యూటరీకరణ చేశారు.
కార్యకర్తలకు అండగా..
మిగతా పార్టీలు బతికుండగా కార్యకర్తలను వాడుకొని.. ఆపై వారి కుటుంబాలను గాలికి వొదిలి వేస్తాయి. ఇక అధికారంలోకి వస్తే కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా విస్మరిస్తాయి. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా తన ప్రస్థానం సాగిస్తున్నది. ఆది నుంచీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరినీ తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది. అందుకోసం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ముందుగా రూ. 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తున్నది. ప్రమాదవశాత్తు సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోతే.. బీమా ద్వారా వచ్చే రూ. 2 లక్షల చెక్కును తీసుకెళ్లి సదరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆ కుటుంబాలకు అందిస్తున్నారు. అంతే కాదు, సదరు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని చూసి.. అవసరమైతే వ్యక్తిగతంగానూ సాయం చేస్తూ వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలకు ఈ పద్ధతిలో బీఆర్ఎస్ అండగా నిలిచింది. నిజానికి ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే.. ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుం దో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు తలకిందులై కుటుంబాలు రోడ్డు పాలయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరికీ రావద్దన్న ఉదాత్త ఆశయంతో పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తోంది. తద్వారా కొన్ని వందలాది కుటుంబాలు కొంత మేరకైనా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాయి.
126 మందికి.. రూ.2.52 కోట్లు
బీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా అంకిత భావంతో పని చేసే కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటుంది. మరే రాజకీయ పార్టీలో లేనివిధంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. గడిచిన కొన్నేళ్లలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేసి అండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 5,036 కార్యకర్తలు మృతిచెందగా వారి కుటుంబాలకు బీమా రూపంలో రూ.100.72 కోట్లు చెల్లించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో దాదాపు 126 మందికి రూ.2 లక్షల చొప్పున రూ. 2.52 కోట్లు అందించింది. ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇద్దరు కార్యకర్తలకు సంబంధించిన దరఖాస్తులు ప్రాసెసింగ్లో ఉండగా, మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కార్యకర్తల కుటుంబాలకు ఈ మొత్తం అందాయి. పార్టీ కోసం కష్టపడి పని చేసి కార్యకర్తలు.. చనిపోయాక బీమా రూపంలో అండగా నిలవడం గొప్ప విషయమని బాధిత కుటుంబాలు అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నాయి.
వెంకటరమణ కుటుంబానికి కొండంత అండ
కడెం, సెప్టెంబర్ 26: కడెం మండలంలోని దిల్దార్నగర్కు చెందిన వేములవాడ వెంకటరమణ (35) బీఆర్ఎస్లో క్రియాశీలక కార్యకర్తగా పని చేశాడు. వేములవాడ లస్మవ్వ-రాజన్న దంపతులకు ఐదుగురు సంతానం కాగా, వెంకటరమణ అందరికంటే చిన్నోడు. 2021 సెప్టెంబర్ 15వ తేదీన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామానికి అత్తగారింటికి వెళ్లిన ఆయన, అక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కార్యకర్తగా తెలంగాణ ఉద్యయం నుంచి పని చేసిన ఆయనకు పార్టీ సభ్యత్వం ఉండడంతో స్థానిక సర్పంచ్ బద్దనపెల్లి విజయస్టీఫెన్, ఉపసర్పంచ్ దాసరి సుగుణకర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వెళ్లి మరణానికి సంబంధించిన వివరాలతో పాటు, పార్టీ సభ్యత్వ రశీదును అప్పగించడంతో మూడు నెలల్లోనే ఆయన కుటుంబానికి రూ. 2 లక్షల బీమా అందించారు. వెంటకరమణ కుటుంబానికి ఇది కొండంత అండగా నిలిచింది.
బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంది
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 26 : మా ఆయన గుత్తికొండ రవీందర్ 2021 ఫిబ్రవరి 5న కరెంట్ షాక్తో చనిపోయిండు. టెంట్ హౌస్ నిర్వహిస్తూ మా కుటుంబాన్ని పోషించేవారు. ఆయన మృతితో ఒక్కసారిగా మా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మాకు కొడుకు వికాస్, కూతురు అమూల్య ఉంది. కొడుకు బీటెక్ పూర్తిచేశాడు. పాప డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. భర్త రవీందర్ బీఆర్ఎస్లో చురకుగా పనిచేసేవారు. అనుకోకుండా మృతిచెందడంతో ఒక్కసారిగా మా కుటుంబంలో చీకటి అలుముకున్నది. ఒకరోజు ఎమ్మెల్యే దివాకర్రావు కుమారుడు విజిత్రావు మా ఇంటికి వచ్చారు. రవి పేరు మీద బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చేసిందని చెప్పారు. బీమా డబ్బులు రూ. 2 లక్షల చెక్కును ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయాలని చెప్పారు. దీంతో మాకు ఎంతో బలం వచ్చినట్లనిపించింది. ఏదైనా పని ఉంటే పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి చేసి పెడుతున్నారు. – గుత్తికొండ రమాదేవి, మంచిర్యాల
ఇద్దరు పిల్లలను చదివిస్తున్న..
ఇచ్చోడ, సెప్టెంబర్ 26 : నా పేరు రాథోడ్ లక్ష్మి. మాది సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామం. గతేడాది నా భర్త రాథోడ్ సుభాష్ నేరడిగొండ మండలంలోని కుప్టిఘాట్లో లారీ ఢీకొని చనిపోయిండు. దీంతో నా కుటుంబం ఎన్నో కష్టాల్లో పడ్డది. గతంలో నా భర్త బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతుండే. ఆయనకు పార్టీ బీమా చేయించింది. అవే పైసలు రూ. 2లక్షలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కుటుంబానికి ఇచ్చిన్రు. దీంతో నాకున్న మూడెకరాల భూమిలో అప్పులు తీసుకోకుండా వ్యవసాయం చేస్తూ, నా పెద్ద కొడుకు రాథోడ్ నితిన్, చిన్న కొడుకు వికిల్ను చదివిస్తున్న. బీఆర్ఎస్ సభ్యత్వంతోపాటు రైతుబీమా చేయడంతో వచ్చిన బీమాతోనే ఆర్థికంగా బలపడ్డాం. ఈ బీమా రాకపోతే మా గతి రోడ్డు పాలయ్యేది. పార్టీలో నా భర్త కార్యకర్తగా కష్టపడ్డందుకు మా కుటుంబాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం.
శశిపాల్ కుటుంబానికి ధీమా
కడెం, సెప్టెంబర్ 26: కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ శశిపాల్ (30) బీఆర్ఎస్ పార్టీకి పనిచేసేటోడు. పార్టీ కార్యక్రమాలన్నింటికీ హాజరయ్యేది. ఉడుంపూర్కు చెందిన గైక్వాడ్ తిరుమల,కేశవ్పటేల్ దంపతులకు ఐదుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు కాగా, ఇందులో శశిపాల్ మూడోవాడు. గతేడాది జులై 19న వ్యవసాయ పనుల కోసం పొలానికి పోయిన శశిపాల్, అక్కడే బావిలో పడి చనిపోయిండు. అయితే బతికున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ శశిపాల్ను క్రియాశీలక కార్యకర్తగా గుర్తించి, బీమా చేయించింది. పార్టీ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ ఈ పత్రాలు పంపించి, బీమా ఇప్పించారు. సెప్టెంబర్ 2022లో రూ. 2 లక్షల బీమా డబ్బులు రావడంతో పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు వారి కుటుంబానికి అందజేసి, అండగా నిలిచారు.
నియోజకవర్గాల వారీగా బీమా డబ్బులు అందుకున్న వారు
అప్పులు కట్టిన..
ఇచ్చోడ, సెప్టెంబర్ 26: నా భర్త సింగరి చిన్నయ్య కేసీఆర్ పార్టీల తిరిగేటోడు. మనం మంచిగుం డాలంటే కేసీఆర్ సారే గెలవాలని అనేటోడు. ఆయన పార్టీల ఉన్నప్పుడే పార్టీ సభ్యత్వం కింద బీమా చేయించింది.ఇక నా భర్త చిన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. మా కుటుంబం పెద్ద దిక్కులేక రోడ్డున పడింది. పార్టీ నాయకులు బీమా డబ్బులు వస్తయని చెప్పిన్రు. ఆ తర్వాత రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో జమైనయ్. గతంలో ఉన్న అప్పులన్నీ ఈ పైసలతోని కట్టిన. పేదోళ్ల బతుకులు బాగుపడ్డాయంటే అది సీఎం కేసీఆర్తోనే. అందరికీ అండగా నిలుస్తున్నడు.
-సింగరి లింగమ్మ, బుద్దికొండ, నేరడిగొండ.
రూ. 2 లక్షలే ఆదుకున్నయ్..
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 26: మాది కొరిటికల్ గ్రామం. మాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. వ్యవసాయ పనులే మాకు జీవనాధారం. ఎకరం భూమి ఉంది. నా భర్త మోతె రాజేశ్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఆయన బతికున్నప్పుడు పొలం పనులు చేసుకుంటూనే బీఆర్ఎస్ పార్టీలో తిరిగేటోడు. కేసీఆర్ సారు మనకు ఎంతో చేస్తున్నడు.. ఆయన కోసం కూడా మనం కష్టపడాలే అనేటోడు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్, కళ్యాణలక్ష్మి.. అన్ని పథకాల గురించి మంచిగ చెప్పేటోడు. అయితే పార్టీ సభ్యత్వం ఉండడంతో, ఆయనకు రూ. 2లక్షల బీమా నాయకులు చేయించిన్రు. ఇప్పుడవే డబ్బులు నా బిడ్డ పెండ్లికి ఆదుకున్నయ్. కొన్ని అప్పులు కూడా కట్టిన. నా బిడ్డ పెండ్లికి సర్కారు నుంచి కల్యాణలక్ష్మి కూడా వర్తించింది. ఇగ నా భర్త పేరు మీదనే ఎకరం భూమి ఉండడంతో, రైతు బీమా కింద కూడా ఎకరం రూ.5 లక్షలు వచ్చినయ్. నాకు ఇగ వృద్ధాప్య పింఛన్ కూడా వస్తదని అంటున్నరు. ఇన్ని రకాలుగా సర్కారు మమ్మల్ని ఆదుకుంటున్నది. మా ఇంటి పెద్ద పోయినంక ఎట్ల బతుకుడో అనే రంది ఉండే. మా అన్నోలే సీఎం కేసీఆర్ నన్ను, నా బిడ్డలను ఆదుకున్నడు.
-మోతె లక్ష్మి, కొరిటికల్