కుంటాల, డిసెంబర్, 18 : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కల్లూర్ సాయిబాబా ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. దత్త జయంతిని పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో దత్త జననం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కట్న కానుకలు సమర్పించుకున్నారు. సాయిబాబా, అనుసూయ మాత, దత్తాత్రి తదితర దేవతామూర్తుల విగ్రహాలను బ్యాండ్ మేళాలతో ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. పలువురు ప్రముఖులు దత్త జయంతి ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు ప్రజలు పోటెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ప్రత్యేక పూజలు
భైంసా, డిసెంబర్, 18 : పట్టణంలోని సాయిబాబా ఆలయం, మండలంలోని దేగాం దత్తాత్రేయ ఆలయం, శిశు మందిర్ పాఠశాలలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అన్నదానం చేశారు. తహసీల్దార్ విశ్వంభర్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్. డాక్టర్ నాగేశ్, కిసాన్గల్లీ సర్పంచ్ కోర్వ చిన్నన్న, అల్లకొండ రాజేశ్వర్, మిలటరీ గోపాల్, కాండ్లి సాయినాథ్, కుంట కాశీనాథ్ ఉన్నారు.
గండిరామన్న ఆలయం కిటకిట
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 18 : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్త సాయి ఆలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న దత్త జయంతి వేడుకలు శనివారంతో ముగిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. సాయి భక్త భజన మండలి ఆధ్వర్యంలో ప్రారంభించిన 48 గంటల అఖండ సాయి నామ జపం ముగిసింది. సాయి భక్తులతోపాటు సాయి దీక్షాపరులు అన్నదానం నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు లక్కాడి కృష్ణవేణి-రామ్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించిన చావడిని ప్రారంభించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కాళేశ్వర ఆలయ డైరెక్టర్ కొరిపెల్లి దేవేందర్ రెడ్డి, జిందం గోవర్ధన్, లక్కాడి జైపాల్ రెడ్డి, పూదరి నరహరి, లింగారెడ్డి, మహేందర్ యాదవ్, జొన్నల మనోహర్, గోపాల్ రెడ్డి, దశాగౌడ్, కందుల పండరి, ఆమెడ శ్రీధర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
యోగానంద సరస్వతీ పూజలు
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 18: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్తజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతీ హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని పల్లకీలో ఊరేగించారు. భక్తులు చేసిన నామస్మరణతో కాలనీ ఆధ్యాత్మిక భావంతో వెల్లివిరిసింది.
ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలి
బోథ్, డిసెంబర్ 18: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత చేకూరుతుందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని కన్గుట్టలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీతో పాటు ఎంపీడీవో రాథోడ్ రాధ, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ, సర్పంచ్ మారుపాక శ్యామల, మిట్కారే రాజేశ్వర్ పూజలు చేశారు. ఆలయ ఆవరణలో తాగునీటి సౌకర్యం కోసం రూ.లక్ష మండల పరిషత్ నిధులు మంజూరు చేస్తామని ఎంపీపీ ప్రకటించారు. రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ ప్రహరీ నిర్మాణం కోసం రూ.5 లక్షల ఎంపీ నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిగెల రమేశ్, మారుపాక రమేశ్, భక్తులు పాల్గొన్నారు. బోథ్లోని శబరిమాతా ఆశ్రమ (ఎస్బీఐ పక్కన) భక్తులు పల్లకీని ఊరేగించారు. అనంతరం ఆశ్రమంలో పూజలు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించారు. కౌఠ (బీ), ధన్నూర్ (బీ), పొచ్చెర, మర్లపెల్లి శబరిమాతాజీ ఆశ్రమాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో అభిషేకాలు చేశారు.