త్రిదండి అహోబిలం రామానుజ జీయర్స్వామి
నస్పూర్లో 1008 మంది భగవత్ బంధువులతో ఆకట్టుకున్న కోలాటాల ప్రదర్శన
సీసీసీ నస్పూర్, డిసెంబర్ 18: పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని, నీటి వనరులు పెరిగి పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారుతున్నదని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం రామానుజ జీయర్స్వామి అన్నారు. శ్రీరామనుజ సహస్రాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నస్పూర్ నాగార్జునకాలనీ సింగరేణి న్యూ స్టేడియంలో 1008 భగవత్ బంధువులతో కోలాటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా భాగ్యనగరంలో శ్రీరామానుజ విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. 108 దివ్య తిరుమల ఆలయాలను నిర్మిస్తామని వివరించారు. ఫిబ్రవరిలో శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే సుఖశాంతులతో ఉంటారని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కోలాటాల ప్రదర్శనకు వచ్చిన వారందరినీ అభినందించారు. పాల్గొన్న వారందరికి జెట్ ఆస్ట్రేలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లను అందజేశారు. కోలాటాల ప్రదర్శనపై నిర్వాహకులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం సురేశ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటూజీఎం గుప్తా, సివిల్ డీజీఎం శివరావు, జెట్ వికాస తరంగిణి జిల్లా కోఆర్డినేటర్ మంజుభాషిణి, వేంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునరావు, సభ్యుడు కాల్వ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కోలాట మహోత్సవ పాట చిత్రీకరణ
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 18 : జెట్ వికాస తరంగిణి, జెట్ యువ వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం కార్యక్రమానికి మంచిర్యాల నుంచి భక్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు నృత్యాలతో, కోలాటాల ప్రదర్శన చేస్తూ పాటను చిత్రీకరించారు. ఈ కార్యక్రమాన్ని త్రిదండి అహోబిలం రామనుజ జియర్ స్వామి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జెట్ యువ వికాస్ కోఆర్డినేటర్ మంజు భాషిని, సింగర్, డైరెక్టర్ పడాల తారక రామరావు, శ్రీరాంపూర్ జీఎం సురేశ్, మల్లికార్జున్, రాంచందర్, జెట్ వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.