కనులపండువగా దత్త జయంతి వేడుకలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్రావు దంపతులు
శ్రీరాంపూర్, డిసెంబర్ 18: దత్తాత్రేయ జయంతి వేడుకలు పలు ఆలయాల్లో శనివారం వైభవంగా జరిగాయి. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయాలయం నుంచి కోటి పుష్పాలతో ఆర్కే 8కాలనీలోని షిర్డీ సాయిబాబా ఆలయం వరకూ శోభాయాత్ర నిర్వహించారు. 108 మంది మాతలు సంకీర్తన నిర్వహించారు. మరికొందరు మహిళలు కోలాటమాడుతూ నృత్యాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లెత్తుల రాజేంద్రపాణి, కౌన్సిలర్ పూదరి కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు గోవర్ధన వెంకటరమణాచారి, నరహరిగురుస్వాములు పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు దంపతులు, సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం సురేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ డాక్టర్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దత్త జయంతి వేడుకలు కనుల పండువగా నిర్వహించడం అభినందనీయమన్నారు. సాయి కృపతో కరోనా తొలగిపోవాలని కోరారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు రమేశ్ రెడ్డి, బండి రజిత, కౌట్ల రాజబాబు, రాజునాయక్, సురేశ్, కౌన్సిలర్లు చీడం మహేశ్, బండి పద్మ, పంబాల గంగాఎర్రయ్య, జనార్దన్, మాజీ సర్పంచులు కమలాకర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోకల సురేశ్, నాయకులు వేల్పుల రవీందర్, అర్కాల శ్రీనివాస్, దగ్గుల మధు, దెబ్బటి రామన్న పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 18 : జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయాల్లో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పారాయణం మధ్య సాయిబాబా, దత్తాత్రేయ స్వామికి అభిషేకం, మహా అలంకరణ, నైవేద్యం, మంగళహారతి పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం కోసం బారులు తీరారు. పాత మంచిర్యాల లోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రజాప్రతినిధులు హాజరై పూజలు చేశారు.