నార్నూర్,డిసెంబర్18: ఎనిమిదో విడుత హరితహారం పనులు నార్నూర్,గాదిగూడ మండలాల్లో మొదలయ్యాయి. ఈ విడుతకు ఉమ్మడి మండలంలోని 48 వన నర్సరీలు ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీకో నర్సరీ చొప్పున కేటాయించారు. ఈ ఏడాదికి సంబంధించి 48నర్సరీల్లో 5. 28 లక్షల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. మహా త్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మొక్కల పెంపకానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని నర్సరీల్లో ప్రస్తుతం ఎర్ర,నల్లరేగడి,పెంటమన్ను తెచ్చి జల్లెడ పట్టి శుభ్రం చేస్తూ ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపే పనులు సాగుతున్నాయి.
మొక్కల పెంపకానికి రూ.1.13 కోట్లు అంచనా
ఉమ్మడి మండలం వ్యాప్తంగా 48నర్సరీల్లో మొక్కల పెంపకం,కూలీల వేతనాలు అన్నింటికీ కలిపి ఈ సారి రూ. 1,13,28,000 ఖర్చవుతాయని అంచనా వేశారు. ఒక్కో న ర్సరీకి రూ.2.36 లక్షలు ఖర్చు అవుతాయని ఈజీఎస్ అధికారులు అంచనా వేశారు. మొక్కల పెంపకానికి సంబంధించి సంచుల్లో మట్టి నింపే పనులు పూర్తయ్యాక విత్తనాలు తెచ్చి నాటనున్నారు. అలాగే టేకు స్టంప్స్ తెచ్చి వాటిని కూడా పెంచనున్నారు. ఒక్కో నర్సరీలో 10 వేల నుంచి11వేల వరకు మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టేకు,పండ్లు, నీడ నిచ్చే, పూల మొక్కలను పెంచనున్నారు. మొక్కలు పెరిగిన తర్వాత వర్షాలు పడినప్పుడు రైతుల చెల్కల్లో, గట్ల వెంట, కార్యాలయాల్లో, కమ్యూనిటీ ప్రదేశాల్లో, రోడ్ల పక్కన మొక్కలు నాటనున్నారు.
ముమ్మరంగా పనులు చేస్తున్నాం..
వననర్సరీలకు సంబంధించి ఈ విడుత పనులు దాబా బీ నర్సరీలో మొదలు పెట్టాం. మట్టి తెచ్చి జల్లెడ పట్టించాం. కూలీలు సంచుల్లో మట్టి నింపుతున్నారు. మండలంలోముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. వన సేవకుడి ద్వారా మొక్కల సంరక్షణ పనులు చేపడుతాం.
-నైతం బాదుబాయి, దాబా సర్పంచ్, గాదిగూడ మండలం
పనులు మొదలయ్యాయి..
ఉమ్మడి మండలంలో 48వన నర్సరీలు ఏర్పాటు చేశాం. అన్ని నర్సరీల్లో మొక్కలు పెంచడానికి సరిపడా మట్టి తెప్పించి సంచుల్లో నింపే పనులు ప్రారంభించాం. ఈ సారి మండల వ్యాప్తంగా 5,2800లక్ష మొక్కలు పెంచనున్నాం. ఇందుకోసం రూ.1,13, 28,000 ఖర్చువుతాయయని అంచనా వేశాం.
-జాదవ్ శేషారావ్(ఈజీఎస్ ఏపీవో నార్నూర్)