మన చౌక బియ్యం మహారాష్ట్రకు అక్రమంగా తరలింపు
చెక్పోస్టులు లేని సరిహద్దుదారులే రాచమార్గాలు
ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి కొనుగోలు
రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయాలు
లక్షల రూపాయల అక్రమార్జన
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) :పేదల ఆకలి తీర్చేందుకు సర్కారు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మన బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. వ్యాపారులు స్థానికంగా కిలోకు రూ.10లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసి జిల్లా సరిహద్దుల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి అధికారుల కండ్లు గప్పి లారీలు, వివిధ వాహనాల ద్వారా రోజూ 50 క్వింటాళ్లకుపైగా తరలిస్తున్నారు. అక్కడ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారిస్తే అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చు.
జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కళ్లుగప్పి చెక్పోస్టులు లేని వివిధ మార్గాల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు వద్ద ఏకంగా ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిర్పూర్-(టీ) మండలం వెంట్రావ్పేట్, వాంకిడి మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు దీనికి అడ్డాలుగా మారాయి. వెంకట్రావ్పేట్లో కొంతమంది వ్యాపారులు ప్రత్యేకంగా 5 వరకు కొనుగోలు దుకాణాలు ఏర్పాటుచేశారు. కిలోకు రూ. 15 చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలోని వీరూర్లో రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని గోందియా, బల్లార్షాకు సరఫరా చేస్తారు. అక్కడి మిల్లుల్లో బియ్యాన్ని పాలిష్ చేసి అక్కడే రూ. 30 నుంచి రూ. 35 కిలో చొప్పున విక్రయిస్తారు. అయితే ఇంతకుముందు జిల్లానుంచి పెద్ద పెద్ద వాహనాల్లో వీరూర్కు బియ్యాన్ని తరలించే వ్యాపారులు ఇటీవలి కాలంలో తమ విధానాన్ని మార్చుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్న వ్యాన్లలో వెంకట్రావ్పేట్ వరకు తరలించి అక్కడ గోదాముల్లో డంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి రోజుకు నాలుగైన భారీ వాహనాల్లో 50 టన్నులకు పైగా మహారాష్ట్రలోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అయితే జిల్లాలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై నిఘాపెంచి పట్టుకున్న అధికారులు ఇటీవలి కాలంలో సరిగా దృష్టిసారించకపోవడంతోనే అక్రమ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆసిఫాబాద్, రెబ్బెన, బూరుగూడ, వాంకిడి, కాగజ్నగర్, ప్రాంతాల్లో స్థానిక వ్యాపారులు రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి చిన్న చిన్న వాహనాల్లో వెంకట్రావ్పేట్కు తరలించి అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తూ దళారులు లక్షల్లో సంపాదిస్తున్నారు.