ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలతో కరోనా కట్టడి
పెరిగిన ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులు
సరిహద్దుల్లో పటిష్ట తనిఖీలు
నిర్మల్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తిపై జనానికి అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఉధృతం చేశారు. పరీక్షలను కూడా రెట్టింపు చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొదటి డోసు టార్గెట్కు మించి 104శాతం పూర్తి కాగా, రెండో డోసు 70శాతం అయ్యింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసులోపు యువతలో 57శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వీరితో పాటు హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్కు, వ్యాధులున్న 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు. కాగా.. మూడో ముప్పు పొంచి ఉందని ముందే గుర్తించిన వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, సమూహాల్లోకి వెళ్లకూడదని సూచిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామాల్లో వాల్ పోస్టర్లను సైతం అంటించారు. నిర్మల్లోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మైక్ద్వారా వైరస్ వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేశారు.
సరిహద్దుల్లో గట్టి నిఘా..
నిర్మల్ జిల్లాను ఆనుకొని సుదీర్ఘంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉండడంతో అక్కడి నుంచి వైరస్ వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆరు ప్రధాన చెక్పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ థర్మల్స్క్రీనింగ్ చేస్తున్నారు. దీనికితోడు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సభ్యులు కూడా సహకరిస్తున్నారు. రెడ్క్రాస్, నిర్మల్ సేవా సమితితో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు.