ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీపై సమావేశం
ఎదులాపురం, జనవరి 18 : టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో మంగళవారం టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీలపై పలు సూచనలు చేశారు. వీటి పకడ్బందీ అమలుపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టణ ప్రాంతంలో 64, గ్రామీణ ప్రాంతంలో 29 అనుమతి పొందిన లే అవుట్స్ ఉన్నాయన్నారు. ఆ వివరాలను తహసీల్దార్లకు పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖలకు పంపించినట్లు పేర్కొన్నారు. అనధికారిక లే అవుట్లకు అనుమతించినా, రిజిస్ట్రేషన్లు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఇటీవల అనధికార రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వును క్షుణ్ణంగా చదివి ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. ధరణి పోర్టల్లో నిషేదిత భూముల వివరాలు పొందుపర్చామని, అలాంటి భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయకూడదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసే ఒక నెల ముందు ఈసీ సరిచేసుకోవాలని పేర్కొన్నారు. భవన నిర్మాణాలకు పాత అనుమతులుంటే తిరస్కరించాలని తెలిపారు. ప్రతి మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ తదితర కార్యాలయాల్లో టీఎస్ బీ-పాస్, ఈ-పంచాయతీలకు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు జిల్లా పట్టణ, కంట్రి ప్లానింగ్ అధికారి నరహరి మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల నాలా కన్వర్షన్ ధ్రువీకరణపత్రం, సర్వే ల్యాండ్ అధికారులు జారీ చేసిన హద్దులు, భూములకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లే ఆవుట్ అప్రూవల్ ఈ-పంచాయతీ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు.
పంచాయతీ కార్యదర్శులు లే అవుట్లకు సంబంధించిన రిజిస్టర్లను నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలో 106 అనధికార లే అవుట్లను తొలగించామని తెలిపారు. భవన నిర్మాణాలకు ఆదిలాబాద్ పట్టణంలో మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 131ప్రకారం రెగ్యులరైజ్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మున్సిపల్ యాక్ట్ 172, సబ్ సెక్షన్ 16 ప్రకారం లే అవుట్లను రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. బై నెంబర్తో వచ్చే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయకూడదని, సబ్ డివిజనల్ కమిటీ ద్వారానే బై నంబర్ పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని భూముల రిజిస్ట్రేషన్లకు ఐటీడీఏ పీవో ద్వారా అనుమతి పొంది ఈ-పంచాయతీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఫణిందర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్, కార్డ్ పోర్టల్ను అనుసంధానం చేశామని, ప్రతి రిజిస్ట్రేషన్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు పరిశీలించుకోవచ్చని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ పంచాయతీపై జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఎం.సాయి కిరణ్, డివిజనల్ పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.