జిల్లాలో 24 కేంద్రాల్లో టీకాలు
ఇప్పటి వరకు 4480 మందికి వ్యాక్సిన్
పని చేసే చోటే ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
మార్చి నుంచి 12-15ఏండ్ల లోపు వారికి..
నిర్మల్ అర్బన్, జనవరి 18 : రాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో టీకాల వేగాన్ని విస్తృతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఫ్రంట్ లైన్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోస్ టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం నిర్మల్ జిల్లాలో 24 కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం టీకా ప్రక్రియ ప్రారంభించి ఏడాది పూర్తికాగా.. మొత్తం 5,82,106 మందికి మొదటి డోస్, 3,74,131 మందికి రెండోడోసు టీకాలు అందించారు. 4,480 మందికి బూస్టర్ డోస్ వేశారు.
24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్..
జిల్లాలో బూస్టర్ డోస్ టీకాలకు సైతం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలతో పాటు 24 సెంటర్లను ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో ఫ్రంట్లైన్, హెల్త్కేర్ వర్కర్లు, పాత్రికేయులు, 60 సంవత్సరాలు పైబడిన వారు టీకాలు తీసుకుంటున్నారు. మొత్తం 4,480 మంది బూస్టర్ డోస్ తీసుకోగా.. ఇందులో హెల్త్ కేర్ వర్కర్లు, 1,625 మంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2,076మంది, 60 సంవత్సరాలు పైబడిన వారు 779 మంది ఉన్నారు. కాగా.. కొవిడ్ మొదటి, రెండో దశలో బాగంగా నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ప్రత్యేక కృషితో 100 శాతం ఫస్ట్ డోస్ టీకాలను పూర్తి చేశారు. ఇందులో భాగంగా టీకాలను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 5,82,106 మందికి టీకాలు వేశారు.
మార్చి నుంచి 12-15 ఏండ్ల పిల్లలకు..
పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీనేజర్లకు టీకాలను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో బాగంగా 15-18 సంవత్సరాల్లోపు పిల్లలకు టీకాలు అందిస్తుండగా.. వారి నుంచి ఆదరణ లభిస్తున్నది. గుర్తింపు కార్డుల ఆధారంగా కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మార్చి నుంచి 12-15 సంవత్సరాల్లోపు పిల్లలకు టీకాలు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది.