ప్రాణహితలో గల్లంతైన ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యం
మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు
పర్యవేక్షిస్తున్న ఆర్డీవో, ఏసీపీ
బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ పరామర్శ
కోటపల్లి, జనవరి 18 : ప్రాణహిత నది తీరం కన్నీటి సంద్రమైంది. ఎదిగిన కొడుకులు పండగకు ఇంటికి వచ్చి శవంలా మారడంతో అది చూసినా.. ఆ తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. మండలంలోని ఆలుగామ గ్రామం సమీపంలోని ప్రాణహిత నదిలో సోమవారం ముగ్గురు విద్యార్థులు గల్లంతు కాగా, వారిలో ఇద్దరి ఆచూకీని జాలరులు కనుగొన్నారు. మరో విద్యార్థి కోసం జాలరులు వలలతో గాలింపు ముమ్మరం చేశారు. సుమారుగా 24 గంటల అనంతరం స్థానిక జాలరులు అంబాల విజేయేంద్ర సాయి (14), అంబాల వంశీవర్దన్ (17) మృతదేహాలను అతి కష్టంమీద వెలికి తీశారు. మరో విద్యార్థి గారె రాకేశ్ (17) కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం మధ్యాహ్నం ముగ్గరు విద్యార్థులు గల్లంతు కాగా, వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సహాయ చర్యలను చేపట్టాలని ఆదేశించగా, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. సింగరేణి రెస్క్యూ టీమ్, స్థానిక జాలరులు ఎంతగానో గాలించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ప్రాణహిత నదిపై గట్టి పట్టు ఉన్న జనగామ, రాచర్ల, వెంచపల్లి గ్రామాల సమీపంలోని మత్య్సకారులను చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు రంగంలోకి దింపారు. వీరు ప్రత్యేక వలలతో నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా మొదటగా విజయేంద్రసాయి, తర్వాత వంశీవర్ధన్ మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు తీసుకురాగా విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు
నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు కాగా ఇద్దరి ఆచూకీ లభించగా, గారె రాకేశ్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని, తమ కొడుకును చూపించాలని ఆ విద్యార్థి తల్లిదండ్రులు రోదించిన తీరు కలిచివేసింది.
సహాయ చర్యలను పర్యవేక్షించిన ఆర్డీవో, ఏసీపీ
ప్రాణహిత నదిలో సహాయక చర్యలను మంచిర్యాల ఆర్డీవో వేణు, జైపూర్ ఏసీపీ నరేందర్ పర్యవేక్షించారు. సింగరేణి రెస్క్యూ టీమ్తో పాటు స్థానిక జాలరులతో ముమ్మరంగా గాలించారు. కరీంనగర్ నుంచి స్పీడ్ బోట్ తీసుకువచ్చి గాలింపు చర్యలు మరింత వేగవంతం అయ్యేలా చర్యలు వారు తీసుకున్నారు.