దస్తురాబాద్, జనవరి 18 : నాగోబా మహాపూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు కెస్లాపూర్కు తిరుగు పయనమయ్యారు. 12వ తేదీన కెస్లాపూర్ నుంచి 100 కుటుంబాలకు చెందిన 130 మంది 80 కిలోమీటర్ల దూరంలోని గోదావరికి కాలినడకన బయల్దేరారు. సోమవారం దస్తురాబాద్ మండలానికి చేరుకున్నారు. మల్లాపూర్ గోండు గూడెం ఆశ్రమ పాఠశాలలో రాత్రి బస చేశారు. వీరికి గ్రామ పటేళ్లు, మెస్రం వంశీయులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అన్ని రకాల సౌకర్యాలు, వసతి కల్పించారు. అనంతరం వారితో పాటు గ్రామ మెస్రం వంశీయులు, ఆదివాసులు కుల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు శివారు గోదావరికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేశారు. పితృదేవతలకు పూజలు చేశారు. అనంతరం వారి వెంట తెచ్చిన ఝరిలో గంగాజలంతో తిరుగుపయనమయ్యారు.