జీవో నంబర్ 317 ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు
శాశ్వత టీచర్లు లేని సర్కారు బడులకు ఉపాధ్యాయుల అలాట్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అదనంగా 244 మంది టీచర్స్
ఏండ్ల సమస్యలకు పరిష్కారం.. విద్యార్థులకు మెరుగైన విద్య..
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆనందం..
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, జనవరి 18 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మారుమూల గ్రామాలతోపాటు తండాలు, గూడేలు అధికంగా ఉంటాయి. ఎటువైపు వెళ్లాలన్నా పదుల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బడుల్లో గిరిజనుల పిల్లలే అధికంగా విద్యను అభ్యసిస్తారు. టీచర్లు కూడా పని చేయడానికి ఆసక్తి చూపరు. నూతన జోనల్ విధానంలో భాగంగా రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన జీవో నంబర్ 317తో ఈ బడులకు బలం చేకూరుతున్నది. ఏండ్లుగా ఉపాధ్యాయులు లేక, విద్యావలంటీర్లు కూడా ఆసక్తి చూపనటువంటి మారుమూల గ్రామాలకు కూడా మహర్దశ పట్టనున్నది. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను కేటాయించడంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందనున్నది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయించడం, సొంతూళ్లలోనే పనిచేసే అవకాశం రావడంతో ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు పాఠశాలలకు అన్ని వసతులు కల్పిస్తున్నది. పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా ఉన్నా.. టీచర్లు లేకపోవడంతో బోధన సక్రమంగా సాగేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నూతన జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 317 భరోసా కల్పిస్తున్నది. ఈ విధానంలో స్థానికతకు పెద్దపీట వేస్తూ చేపట్టిన సర్దుబాటులో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు టీచర్లు వచ్చారు. కేటాయింపు ప్రక్రియకు ముందు ఏర్పడిన ఖాళీలతోపాటు తాజాగా ఉద్యోగుల సర్దుబాటుతో ఏర్పడిన ఖాళీలను బదిలీలు, పోస్టింగ్ల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. పోస్టింగ్లలో మారుమూల ప్రాంతాలు, ఆయా శాఖల అవసరాలను బట్టి కనీస సిబ్బంది ఉండేలా చూశారు. సీనియారిటీ, ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా జీవో నంబర్ 317లో మార్గదర్శకాల ప్రకారం పోస్టింగ్లు ఇచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 244 మంది అదనం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 2,444 మంది ఉపాధ్యాయులను కేటాయించగా.. 1,759 మంది పని చేస్తున్నారు. 685 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 317 జీవోను అనుసరించి ఇటీవల జరిగిన బదిలీల్లో జిల్లా నుంచి 384 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఇతర జిల్లాల నుంచి 628 మంది బదిలీపై వచ్చారు. అదనంగా 244 మంది కొత్తగా రావడంతో ఉపాధ్యాయుల కొరత తీరింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల సంఖ్య 2,003కి చేరింది. ఫలితంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు వచ్చారు. గతంలో కంటే ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. కాగా.. స్థానికతకు పెద్దపీట వేస్తూ చేసిన బదిలీల్లో కొందరు జూనియర్ టీచర్లకు ఇబ్బందులు కలిగినప్పటికీ మెజార్టీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల పాఠశాలలకు ఉపాధ్యాయులు..
జీవో నంబర్ 317తో ఉపాధ్యాయుల సర్దుబాటులో మారుమాల గ్రామాల పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాం. అన్ని జిల్లాల్లో సమాన ప్రాతినిధ్యంతో నూతనంగా నియమించే ఉపాధ్యాయులకు మంచి అవకాశం ఏర్పడింది. మారుమూల గ్రామాల్లో కూడా ఉపాధ్యాయుల కొరత తీరింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది.- రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్
ఇప్పుడు సంతోషంగా ఉన్నాం
నా పేరు నంద స్వాతి. 2017లో టీఆర్టీ రాశా. ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లిలోని పాఠశాలలో విధుల్లో చేరా. మా ఆయన సునీల్ ముథోల్ మండల కేంద్రంలో పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో అసిస్టెంట్గా విధులు నిర్వహించేవారు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో నేను ఆసిఫాబాద్, ఆయన ముథోల్లో గది అద్దెకు తీసుకొని ఉండేవాళ్లం. సెలవులు ఉన్నప్పుడు మా ఆయన ఆసిఫాబాద్కు వచ్చేవారు. లేదా నేను ఇక్కడికి వచ్చేదాన్ని. మాకు 9 నెలల పాప ఉంది. ఇద్దరం 300 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహించడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్దాం. స్పౌస్ కింద దరఖాస్తు చేసుకోవడంతో లోకేశ్వరం మండలం పొట్పెల్లి (బీ) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే అవకాశం కలిగింది. ఇప్పుడు సంతోషంగా ఉంది. – నంద స్వాతి-సునీల్
సొంత జిల్లాలో పనిచేసే అవకాశం..
నా పేరు సాయిప్రియ. మాది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం. 2017లో టీఆర్టీ రాశా. ఉపాధ్యాయురాలిగా ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మర్తంగిలో చేరా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బదిలీ కోసం ప్రయత్నాలు చేశా. కానీ కాలేదు. 2019లో బ్రహ్మయ్యతో నా పెళ్లి జరిగింది. మా ఆయన భైంసా మండలం పెండ్పెల్లిలోని యూపీఎస్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. స్పౌస్ కింద దరఖాస్తు చేసుకోవడంతో లోకేశ్వరం మండలం సాయినగర్ తండా ఎంపీపీఎస్లో పోస్టింగ్ ఇచ్చారు. మాకు 9 నెలల పాప ఉంది. మెటర్నిటీ సెలవును ఉపయోగించుకున్నాం. ఇప్పుడు సొంత జిల్లాలో పని చేసే అవకాశం లభించింది.
–సాయిప్రియ- బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు
అప్పుడు ఒక్కరే.. ఇప్పుడు ముగ్గురు
పక్క చిత్రం.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాం యూపీఎస్. ఏడు తరగతుల్లో 119 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. ప్రధానోపాధ్యాయుడి(హెచ్ఎం)గా శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు. అన్ని తరగతులకు కలిపి ముగ్గురు అవసరం ఉండగా.. ఒక్కడే ఉపాధ్యాయుడు బోధిస్తుండడంతో ఇబ్బందిగా ఉండేది. స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. 317 జీవో ప్రకారం.. రాష్ట్ర సర్కారు చేపట్టిన బదిలీల్లో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి జయసారథి, మంచిర్యాల జిల్లా నుంచి సంతోష్ సొంతూరు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. ఇప్పుడు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడంతో పిల్లలకు మేలు జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు.. సొంతూరికి వచ్చినందుకు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.