ఆదిలాబాద్ టౌన్, జనవరి 19 : ఇద్దరు అంతర్రా ష్ట్ర గంజాయి స్మగ్లర్లను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మావల పోలీస్స్టేషన్లో ఆదిలాబాద్ గ్రామీణ సీఐ రఘుపతి గురువారం వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలానికి చెందిన ప్రశాంత్ జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్మగ్లర్గా మారాడు. తన మిత్రులతో కలిసి ఆంధ్రా, ఒడిశా బార్డర్ సమీపంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కు సరఫరా చేస్తున్నాడు. అదేవిధంగా తనకు మామ వరుస అయిన మిలింద్ నిర్వతికి కూడా లాభాలు పొందవచ్చు అని చెప్పి, ఈనెల 14న ఇరువురు హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రశాంత్కు ముందే పరిచయం ఉన్న లక్ష్మణ్ నివాసం కాట్రగడ్డకు ఫోన్ చేశారు. తమకు గంజాయి కావాలని చెప్పి ఇద్దరు ఈనెల 15న భద్రాచలం చేరుకొని, రాత్రి అక్కడే బస చేశారు. తర్వాత లక్ష్మణ్కు ఫోన్ చేసి సిలేరుకు వెళ్లి కలిశారు. ప్రశాంత్ రూ.10 వేలు అడ్వాన్సుగా ఇచ్చి కిలో గంజాయి రూ. 3 వేల చొప్పున 8 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. ఈనెల 17న ఉదయం భద్రాచలానికి చేరుకున్నారు. అప్పుడు లక్ష్మణ్ ప్రశాంత్కు ఫోన్ చేసి మీరు బస్టాండ్కు వెళ్లండి అక్కడ తమ వ్యక్తి గంజాయి ప్యాకెట్లు ఇస్తాడని చెప్పగా, ప్రశాంత్, మిలింద్ వాటిని తీసుకొని ప్రశాంత్ తన ఫోన్ పే ద్వారా రూ.13 వేలను లక్ష్మణ్ ఇచ్చిన నంబర్కు పంపించాడు. అనంతరం ఖమ్మం నుంచి రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి ఆదిలాబాద్లో ఈనెల 18న ఉదయం దిగారు. తెలిసిన వారి దగ్గర ఉండి ఈనెల 19న గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా దస్నాపూర్ తిరుమల పెట్రోల్ బంక్ దగ్గర ఆటో కోసం చూస్తున్నారు. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు మావల పోలీసులు నిందితులను పట్టుకొని బ్యాగులను తనిఖీ చేయగా 4 నిషేధిత గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ ఓపెన్ మార్కెట్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి ప్యా కెట్లు, సెల్ఫోన్లను జప్తు చేశారు. తదుపరి విచారణ అనంతరం రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. సమావేశంలో మావల రెండో ఎస్ఐ ఇసాక్, సిబ్బంది పాల్గొన్నారు.