ఈ నెల 31 నుంచి పూర్తిగా నిలిపివేత 1994లో రిలే కేంద్రం ఏర్పాటు
1997 నుంచి వివిధ కార్యక్రమాలు ప్రారంభం
ఎఫ్ఎం ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు
బెల్లంపల్లిటౌన్, డిసెంబర్ 17 : బెల్లంపల్లిలోని దూరదర్శన్ ప్రసారాలకు శాశ్వతంగా బ్రేక్ పడనున్నది. ఇప్పటి వరకు చిత్రలహరి, విద్య, వినోదం, వ్యవసాయం, క్రీడలు ఇతర కార్యక్రమాలు వీక్షించిన ప్రజలకు అవి ఈ నెల 31తో బంద్ కానున్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని టీసీవోఏ క్లబ్ సమీపంలో అద్దె ప్రాతిపదికన సింగరేణి క్వార్టర్లో నిర్వహిస్తున్న దూరదర్శన్ రిలే కేంద్రాన్ని ఎత్తివేయనున్నారు. ఈ నెల 31న సాయంత్రం 5 గంటల తర్వాత దూరదర్శన్ జాతీయ, ప్రాంతీయ ప్రసారాలను నిలిపివేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రిలేకేంద్రాల ఎత్తివేత
కేంద్రం ప్రభుత్వం అన్ని రంగాల్లో డిజిటలైజేషన్కు పెద్దపీట వేస్తోంది. దీంట్లో భాగంగా అన్లాగ్ ట్రాన్స్మీటర్ ద్వారా కొనసాగుతున్న దూరదర్శన్ కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసింది. గత రెండేళ్ల నుంచి ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర భారత దేశంలో ఎత్తివేయగా దక్షిణ భారత దేశంలో ఎత్తివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది నిర్మల్ కేంద్రాన్ని ఎత్తివేయగా ఈ నెల 31న బెల్లంపల్లి, ఆదిలాబాద్, సిర్పూర్ కేంద్రాలను మూసి వేయడానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి పరికరాలను బహిరంగా వేలం వేస్తుండగా కేంద్రాన్ని నిర్వహిస్తున్న సింగరేణి క్వార్టర్ను యాజమాన్యానికి అప్పగించే పనులు ముమ్మరమయ్యాయి.
1994లో కేంద్రం ఏర్పాటు
బెల్లంపల్లి పట్టణంలో 1994లో రిలే కేంద్రాన్ని ఏర్పాటు చేయగా 1997 మార్చి 30న దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రిసీవర్లు, నాలుగు ఆంటీనాలు, 45 మీటర్ల టవర్తో ప్రసారాలు నిరాటకంగా కొనసాగుతున్నాయి. 100 వాట్స్ లోపవర్ టెరస్ట్రియల్ ట్రాన్స్మీటర్ (ఎల్పీటీ) ద్వారా 10 ప్రీక్వేన్సీతో దూరదర్శన్ జాతీయ, ప్రాంతీయ ప్రసారాలు అందిస్తూ వస్తోంది. ఈ రిలే కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో నాణ్యతతో కూడిన ప్రసారాలు అందించారు. రిలే కేంద్రంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ జయబాబు, టెక్నీషియన్లు నరసింహరాజు, శ్రీనివాస్, హెల్పర్గా బాషబోయిన మేఘనాథ్ విధులు నిర్వరిస్తున్నారు.
ఎఫ్ఎం ఏర్పాటు చేస్తే..
దూరదర్శన్ కేంద్రం ఎత్తివేసే క్రమంలో ఇక్కడ ఎఫ్ఎం కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్నగర్, రామగుండంలో ఎత్తివేసిన దూరదర్శన్ కేంద్రాల్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బెల్లంపల్లిలో మాత్రం కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం విముఖత చూపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత భవనం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం ఇందుకు బలం చేకూరుతోంది. సంబంధిత కేంద్రమంత్రులు స్పందించి దూరదర్శన్ కేంద్రంలో ప్రసారాలు నిలిపివేయకుండా ఎఫ్ఎం కేంద్రం ఏర్పాటు అయ్యేవిధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రసారాలు నిలిపివేస్తాం..
ప్రసార భారతి బోర్డు ఆదేశానుసారం ఈ నెల 31న సాయంత్రం 5 గంటలకు బెల్లంపల్లిలో దూరదర్శన్ కేంద్రం ప్రసారాలను నిలిపివేయనున్నాం. ఇక్కడి నుంచి జాతీయ,ప్రాంతీయ ప్రసారాలు జరగవు. ప్రజలందరూ ఈ మార్పును గమనించాలి. ఇక్కడి సిబ్బందిని వరంగల్, హైదరాబాద్ వంటి పెద్ద రిలేకేంద్రాలకు బదిలీ చేయనున్నాం. మరికొంత మందిని ఎఫ్ఎం రేడియో కేంద్రాల్లో సర్ధుబాటు చేస్తాం.
-జయబాబు, అసిస్టెంట్ ఇంజినీర్