విద్యుత్శాఖ నిర్మల్ జిల్లా అధికారి జయంత్రావు చౌహాన్
పట్టణంలో కార్యాలయంలో ఏఈలతో సమావేశం
కడెం సబ్స్టేషన్ కార్యాలయం తనిఖీ
నిర్మల్ టౌన్, డిసెంబర్ 17 : విద్యుత్ చౌర్యానికి పాల్పడితే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా విద్యుత్శాఖ అధికారి జయంత్రావుచౌహాన్ హెచ్చరించా రు. నిర్మల్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ అక్రమాలను నియంత్రించేందుకు విజిలెన్స్ టీంలు పని చే స్తున్నాయని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తప్పనిసరిగా కొత్త మీటరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి 24 గంటల్లోనే మీ టరు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను ఈ నెలాఖరు వరకు వసూలు చేయాలని సూచించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
కడెం సబ్స్టేషన్ తనిఖీ..
కడెం, డిసెంబర్ 17 : మండల కేంద్రంలోని సబ్స్టేషన్ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ అధికారి తనిఖీ చేశారు. సబ్స్టేషన్ను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం వినియోగదారులు సకాలంలో బిల్లులను చెల్లించాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు తమ కస్టమర్ చార్జీలను నెలాఖరు లోగా చెల్లించాలని సూచించారు. అక్రమ కనెక్షన్లు ఉంటే తొలగిస్తామని తెలిపారు. విద్యుత్ సరఫరాపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ తరచూ వచ్చే అంతరాయాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఏఈ సుమన్ కుమార్ ఉన్నారు.