కేంద్రీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీకే సింగ్
కోటపల్లి, డిసెంబర్ 17 : ఎస్సీ రైతుల సంక్షేమమే కేంద్రీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) ధ్యేయమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీకే సింగ్ అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ ఆధ్వర్యంలో కోటపల్లి మండలంలోని మల్లంపేటలో శుక్రవారం ఫీల్డ్ డే నిర్వహించారు. రైతులకు క్రిడా ఆధ్వర్యంలో పంపిణీ చేసిన విత్తనాలు, ఇతర పరికరాలను ఎలా సద్వినియోగం చేసుకున్నారనే అంశంపై క్రిడా డైరెక్టర్ వీకే సింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. క్రిడా ఆధ్వర్యంలో పంపిణీ చేసిన కంది విత్తనాలతో సాగు చేసిన చేనును పరిశీలించి దిగుబడుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డైరెక్టర్ వీకే సింగ్ మాట్లాడుతూ కోటపల్లి మండలంలో 40 శాతం ఎస్సీ రైతులు ఉన్న గ్రామాలైన మల్లంపేట, నాగంపేట, ఎడగట్ట గ్రామాలను ఎస్సీ సబ్ ప్లాన్ పథకానికి ఎంపిక చేశామని తెలిపారు. క్రిడా ఆధ్వర్యంలో రైతులకు అందజేసిన పరికరాలను, అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతి పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ అభివృద్ధి పరికరాలను పంపిణీ చేశారు. క్రిడా సంస్థ ఆధ్వర్యంలో బోరు బావులు తవ్విస్తే రైతులకు మేలు చేకూరుతుందని డైరెక్టర్కు ఎంపీపీ మంత్రి సురేఖ సూచించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సంస్థ డైరెక్టర్ వీకే సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మహ్మమద్ ఉస్మాన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్లు డాక్టర్ టీవీ ప్రసాద్, డాక్టర్ రవికాంత్ అడ్కె, శాస్త్రవేత్త ఏజీకే రెడ్డి, చెన్నూర్ ఏడీఏ బాపు, ఏవో మహేందర్, ఏఈవో వైష్ణవి, సర్పంచ్ అక్కల మధూకర్, ఎంపీటీసీ చంద్రగిరి శంకర్, రైతులు పాల్గొన్నారు.