గ్రామాల్లో అందుబాటులో ఉంటూ పర్యవేక్షణ
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అభివృద్ధి పనుల నమోదు
ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 17: పంచాయతీల అభివృద్ధిలో కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాలను అభిృవృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు లబ్ధి చేకూరేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 3, 4 పంచాయతీలకో కార్యదర్శి ఉండేవారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ప్రజలు నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పల్లెను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పంచాయతీకో కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జేపీఎస్ల నియామకం చేపట్టారు. ప్రస్తుతం ప్రతి పంచాయతీకో కార్యదర్శి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. పంచాయతీలకు నెలనెలా మంజూరవుతున్న నిధులను సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. దీంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో పల్లెలు పచ్చగా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో నిత్యం పారిశుధ్య పనులు చేయిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలోని ప్రతి పంచాయతీకో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు, నర్సరీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రజల మధ్యనే ఉంటూ…
పంచాయతీ కార్యదర్శులు నిత్యం పల్లెల్లోనే ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. నిత్యం గ్రామంలో పారిశుధ్యం, వీధి దీపాలు, ఇంటింటా చెత్త సేకరణ తదితర పనులను పర్యవేక్షిస్తున్నారు. వీటిని వెంట వెంటనే యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కల స్థితిగతుల, సంరక్షణ చర్యలు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల అభ్యున్నతిని అప్ లోడ్ చేస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో పాటు వాటి ఫొటోలు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, రోజువారీ పనుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. దీంతో గ్రామాల రోజువారీ పరిస్థితిని క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే తెలుసుకునే వీలు కలుగుతున్నది.