ఉమ్మడి జిల్లాలో 2,27,127 ఎకరాల కోసం అర్జీ
నెలరోజుల పాటు కొనసాగిన ప్రక్రియ
ఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులు
అర్హులకు త్వరలోనే హక్కు పత్రాల పంపిణీకి కసరత్తు
ఆదిలాబాద్, డిసెంబరు 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీభూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 8 నుంచి ఈ నెల 8 వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీభూముల్లో వ్యవసాయం సాగుతు న్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 19,543 ఎకరాలు, మంచిర్యాలలో 8,276 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నట్లు దరఖాస్తుల స్వీకరణకు ముందుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆధార్నంబరు, ఫోన్ నంబర్, రేషన్కార్డు నంబర్, జీవిత భాగస్వామి పేరు, తండ్రి, తల్లి పేరు, అడ్రస్, గ్రామంలో హక్కు కోరుతున్న భూమి వివరాలు, ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అర్జీదారుడి కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నంబరు, అటవీ భూమి విస్తీర్ణం, స్వయంగా సాగు చేస్తున్నా రా..? ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నా రా..? లాంటి వివరాలు తెలియజేయడంతో పాటు గ్రామ పెద్దల వాంగ్మూలం కాపీని జతపర్చారు.
66,004 దరఖాస్తులు
నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 66,004 మంది రైతులు పోడు భూముల్లో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు జిల్లాల్లో 2,27,129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్లు దరఖాస్తుదారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 33,885 మంది గిరిజన రైతులు 1,24,522 ఎకరాలు, 32,119 ఇతర రైతులు 1,02,507 ఎకరాలకు గానూ హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 11,172 మంది గిరిజనులు 44,120 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,177 మంది గిరిజన రైతులు 51,859 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 5076 మంది 14,955 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 4,460 మంది రైతులు 13,587 ఎకరాల కోసం దరఖాస్తులు అందజేశారు. గిరిజనేతరులు ఆదిలాబాద్ జిల్లాలో 7,712 మంది, 28,472 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13,503 మంది, 44,267 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3590 మంది 10,037 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 7314 మంది,19,830 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన, గిరిజనేతర రైతుల దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా, అర్హులైన రైతులకు త్వరలోనే పోడు హక్కు పత్రాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.