నిర్మల్ టౌన్, డిసెంబర్ 17 : నిర్మల్ జిల్లాలో సఖీ సేవలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు కష్టపడి పని చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సఖీ సేవలపై జిల్లా కో ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. అనాథలైన మహిళలు, యువతులకు నిర్మల్ జిల్లాలో సఖీ కేంద్రం ద్వారా చేయూతను అందించాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈవ్టీజింగ్, ఆడవారిపై హింస, లైంగికదాడులు, వరకట్నం తదితర వాటిపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మహిళలకు ఉన్న చట్టాలపై విస్తృతంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. సఖీ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ప్రతి పల్లెకూ విస్తరించేలా చూడాలని శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి కోరారు. సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్రావు, సఖీ కేంద్రం నిర్వాహకులు సురేందర్రావు, మమత, సిబ్బంది ఉన్నారు.
50 లక్షల మొక్కలు నాటేలా కార్యాచరణ
నిర్మల్ జిల్లాలో వచ్చే ఏడాది తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధ్దార్థ విక్రమ్సింగ్తో కలిసి తెలంగాణకు హరితహారం మొక్కల ప్రణాళికపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 2022-23 సంవత్సరానికిగాను 48 లక్షలు, 2024లో 54 లక్షల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. నాటిన మొక్కలు ఎదిగేలా చూడాలన్నారు. ఇప్పటికే తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో ప్రకృతివనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు నాటిన మొక్కల స్థానంలో ఎండిపోయిన మొక్కలను గుర్తించి కొత్తవి నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, సహకారశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి, పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్కుమార్, డీఎస్వో సుధారాణి, జిల్లా అధికారులు శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.