గ్రామాల్లో పచ్చని వాతావరణం నెలకొల్పుతున్న విలేజ్ పార్కులు
ఏపుగా పెరుగుతున్న వివిధ రకాల మొక్కలు
ఇంద్రవెల్లి, జూన్ 17 : గ్రామాలను పచ్చని తోరణాలుగా మార్చేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు కొత్త అనుభూతిని కల్పిస్తున్నాయి. మండలంలోని 28 పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి చేశారు. వీటిలో వివిధ రకాలకు చెందిన 85వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. ఎకరా భూమి గల పల్లె ప్రకృతి వనంలో 4వేల వివిధ రకాల మొక్కలు, 30 గుంటల స్థలంలో 3 వేల మొక్కలు, 20 గుంటల భూమిలో 2వేల మొక్కలు నాటి పెంచుతున్నారు. వీటి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. నాటిన మొక్కల రక్షణ కోసం ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు ఆకట్టుకున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు ప్రకృతి వనాలకు వెళ్లి సేద తీరుతున్నారు.
ఏర్పాటు ఇలా…
మండలంలోని 28 పంచాయతీ పరిధిలో అధికారులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. మొక్కలు నాటే స్థలానికి చుట్టూ ప్రత్యేకంగా కంచెలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాల్లో వెళ్లడానికి ఆర్చీలు ఏర్పాటు చేశారు. అన్ని రకాల మొక్కలు నాటారు. వాటి రక్షణ కోసం నీటి సౌకర్యం కల్పించారు. ప్రకృతి వనంలో ప్రజలు నడిచే విధంగా ప్రత్యేక ట్రాక్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల చిన్న పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా గుడారాలు, బెంచీలు ఏర్పాటు చేశారు.
మొక్కల రక్షణకు ప్రత్యేక చర్యలు
పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందిని నియమించి మొక్కల పెంపకంతోపాటు పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. బోర్బావి సౌకర్యం లేని చోట ట్యాంకులు ఏర్పాటు చేసి మొక్కలకు నీరు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలుపుతీత పనులు చేస్తున్నారు. చనిపోయిన మొక్కలను తొలగించి అదే స్థలంలో వేరే మొక్క నాటుతున్నారు. దీంతో అన్ని పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగి ఎంతో పచ్చగా కనిపిస్తున్నాయి.