ఆదిలాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :పొగమంచు కమ్ముకోవడం.. వడగండ్లు పడడం.. చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురియడం.. ఈదురుగాలులు వీయడం.. దట్టమైన మబ్బులు ఉండడం.. అల్పపీడన ద్రోణి కారణంగా గాలి సాంద్రత తగ్గడం.. గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తుండడం వల్ల వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకున్నాయి.. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షం రోజులుగా కశ్మీరాన్ని తలపిస్తున్నది. రికార్డుస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 10 గంటలైనా పొగమంచు వీడకపోవడం, సాయంత్రం ఐదు గంటలకే మంచు కమ్ముకోవడంతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇగం భరించలేక పగలే చలిమంటలు కాగుతున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు స్వెట్టర్లు, గ్లౌజులు ధరించి లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. ఇటువంటి విభిన్న వాతావరణం నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పక్షం రో జులుగా వాతావరణంలో విభిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అడవులు, జలవనరులు అధికంగా ఉండడం, సహ్యాద్రి పర్వత శ్రేణుల కారణంగా చలి, ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
అందుకే శీతాకాలంలో పొగమంచు కమ్ముకోవడం, చలి ఉండడం సాధారణం. ఇయ్యేడు పొగమంచుతోపాటు వానలు కురవడం, ఈదురుగాలులు వీచడం, దట్టమైన మబ్బుల కారణంగా చలి అతిగా ఉంటున్నది. సూర్యుడు కూడా కనిపించకపోవడంతో వాతావరణం వేడిగా ఉండడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు వీస్తుండడంతో జనం ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఆవరణలో చలి మంటలు వేసుకుంటున్నారు. విధులకు, వాహనాలపై వెళ్లే వారు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీక్యాప్లు ధరించి వెళ్తున్నారు. జాతీయ రహదారులను ఉదయం పది గంటలైనా పొగమంచు వీడకపోవడంతో వాహనదారులకు దారి కనిపించడం లేదు. లైట్లు వేసుకొని మెల్లిగా వెళ్తున్నారు. ఇంకా.. గాలులు దిశ మార్చుకోవడం, అల్పపీడన ద్రోణి కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. యేటా డిసెంబర్, జవనరి మాసాల్లో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతం వైపు చల్లటి గాలులు వీస్తుంటాయని.. ఈసారి గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తుండడం, అల్పపీడన ద్రోణి కారణంగా గాలి సాంద్రత తగ్గడంతో చల్లటి వాతావరణం నెలకొందని వారు అంటున్నారు. మరో రెండు రోజుల వరకు ఈ ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు.
గాలులు దిశ మారడంతో శీతల వాతావరణం
యేటా చలికాలంలో ఈదురుగాలులు ఆదిలాబాద్ జిల్లా మీదుగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు వీస్తుంటాయి. భూమి నుంచి సముద్రం వైపు, సముద్రం నుంచి భూమి వైపు గాలులు వీయడం నిరంతర ప్రక్రియ. మహారాష్ట్రలోని విదర్భ, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల వైపు నుంచి వీచే శీతలగాలులు తమ దిశను మార్చుకొని వాయువ్యం నుంచి వీస్తున్నాయి. దీంతోపాటు అల్పపీడన ద్రోణి కారణంగా గాలి సాంద్రత తగ్గింది. చల్లటిగాలుల ప్రభావం యేటా రెండు, మూడ్రోజులు మాత్రమే ఉంటుంది. రెండు కారణాల వల్ల ఈసారి వారం రోజులుగా ఉంటున్నది.