108 మందిని సత్కరించిన మంత్రి అల్లోల దంపతులు
కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న సీఎం : ఐకేరెడ్డి
నిర్మల్ అర్బన్, జనవరి 17 : కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 108 మంది బ్రాహ్మణ దంపతులకు పాదపూజ చేశారు. శాస్త్రీనగర్ కాలనీలోని తమ నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి-విజయలక్ష్మి దంపతులు బ్రాహ్మణ పండితులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాదాయ,ధర్మాదాయ శాఖ పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం నభూతోనభవిష్యత్ అన్నట్లు కొనసాగుతుందన్నారు. మార్చిలో ఆలయ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం, ధర్మపురి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఆలయ ఉద్యోగులు,అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. భగవత్ సంకల్పంతో దంపతీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన వారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు లేవన్నారు. భగవత్ కృప, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వరుసగా రెండోసారి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.