మరో ముగ్గురు విద్యార్థులు క్షేమం
సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన స్టూడెంట్స్
రోదనలతో దద్దరిల్లిన నది పరీవాహక ప్రాంతం
సహాయ చర్యలకు విప్ బాల్క సుమన్ ఆదేశం
గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం
లభించని ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు..
కోటపల్లి, జనవరి 17 : ఈత సరదా మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు.. ప్రాణహితలోకి ఈత కోసం వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతు కాగా, మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామానికి చెందిన గారె రాకేశ్(20), అంబాల వంశీ(20), అంబాల విజయేందర్ సాయి (16), తగరం శ్రావణ్ (21), గారె కార్తీక్ (18), అంబాల రఘు (18) సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చారు. వీరంతా కలిసి సోమవారం గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలోకి స్నానం కోసం వెళ్లారు. విద్యార్థులందరూ సరదాగా స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో నది లోతును, ప్రవాహాన్ని విద్యార్థులు అంచనా వేయకుండా ముందుకు సాగారు. నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో గారె రాకేశ్, అంబాల వంశీ, అంబాల విజయేందర్ సాయి, తగరం శ్రావణ్ నదిలో కొట్టుకుపోయారు. గమనించిన మత్స్యకారుడు అశోక్ విద్యార్థులు గల్లంతైన ప్రదేశానికి చేరుకొని గాలించారు. అందులో శ్రావణ్ను క్షేమంగా తీసుకురాగలిగారు. గారె రాకేశ్, అంబాల వంశీ, అంబాల సాయి నదిలో గల్లంతుకాగా.. విషయం తెలుసుకున్న చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సర్పంచ్ కుమ్మరి సంతోష్ సహకారంతో గజ ఈతగాళ్లు, మత్స్యకారులతో సోమవారం సాయంత్రం వరకు నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతు కావడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
మిన్నంటిన రోదనలు..
ముగ్గురు విద్యార్థుల గల్లంతుతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామానికి చెందిన గారె రాజయ్య-శాంతక్కల కుమారైన రాకేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అంబాల సమ్మయ్య-శంకరమ్మల కుమారుడైన వంశీ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, అంబాల మధునక్క-రాజేందర్ కుమారుడైన విజయేందర్ సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ ముగ్గురు నదిలో గల్లంతుకాగా.. కుమారుల కోసం తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. తమ కుమారుల ఆచూకీని కనిపెట్టాలని, నదిలోకి స్నానం చేసేందుకు వస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదని వారు గుండెలవిసేలా విలపించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని విప్ ఆదేశం
కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రాణహితలో గల్లంతు కాగా.. సహాయ చర్యలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. విద్యార్థుల గల్లంతు సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ కలెక్టర్తో మాట్లాడి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. సింగరేణి నుంచి రెస్క్యూ టీం సహకారం తీసుకొని గాలింపు చేపట్టాలన్నారు. స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లను తక్షణమే రంగంలోకి దింపాలని పోలీసులకు సూచించారు. సహాయ చర్యల విషయంలో ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మంచిర్యాల ఆర్డీవో వేణుతో పాటు పోలీస్, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సీఐ నాగరాజు పడవ సహాయంతో నదిలోకి మత్స్యకారులతో వెళ్లి విద్యార్థుల గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. గల్లంతైన విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని విప్ ఆకాంక్షించారు. సర్పంచ్లు కుమ్మరి సంతోష్, గట్టు లక్ష్మణ్ గౌడ్, పెద్దింటి పున్నంచంద్, ఎంపీటీసీ తిరుపతి, జేక శేఖర్, స్థానిక నాయకులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.