ఖానాపూర్ టౌన్, జనవరి 17: రానున్న రోజుల్లో ప్రముఖ హీరోలతో జిల్లాలో సినిమాలు చిత్రీకరించి, వెండితెరపై చూపిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు పైడిపెల్లి వంశీ అన్నారు. పట్టణానికి చెందిన సినీ దర్శకుడు పైడిపెల్లి వంశీ ఖానాపూర్కు రావడంతో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జిల్లా విశిష్టతను వివరించారు. సినీ పరిశ్రమకు ఇక్కడి ప్రాజెక్టులు, వాటర్ఫాల్స్, ఇక్కడి చరిత్రమ గురించి తెలిపినట్లు వివరించారు. ప్రస్తుతం దిల్రాజు నిర్మాణంలో తమిళ స్టార్ హీరో విజయ్తో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సాయిబాబా ఆలయానికి రూ. 2.10 లక్షల విరాళం
పట్టణంలోని జంగల్ హనుమాన్ శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు పైడిపెల్లి వంశీ సోమవారం రూ. 2 .10 లక్షలు విరాళం అందజేశారు. త్వరలో ఆలయ వార్షికోత్సవంలో నిత్య పారాయణం వారం పాటు నిర్వహించనుండగా భక్తులకు అన్నదానం చేసేందుకు ఈ విరాళాన్ని వినియోగించాలని ఆలయ కమిటీ సభ్యులను కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, కొండాడి గంగాధర్, సురేశ్, అర్చకుడు రామకృష్ణ ఉన్నారు.