తొడసం వంశీయుల సంప్రదాయ పూజలు
భక్తిశ్రద్ధలతో దేవతామూర్తుల ప్రతిష్ఠాపన
నేడు తైలం తాగనున్న ఆ వంశం ఆడబిడ్డ
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వంశీయులు
నార్నూర్,జనవరి17:పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని నార్నూర్ మండల కేంద్రంలోని ఖాందేవ్ పుణ్యక్షేత్రంలో సోమవారం అర్ధరాత్రి తొడసం వంశస్తులు తమ ఆరాధ్య దైవం ఖాందేవుడికి సంప్రదాయ పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఆలయ ప్రాగంణంలో దేవతామూర్తులను ఆచారం ప్రకారం ప్రతిష్ఠించారు. గంగాజలంతో అభిషేకం చేశారు. నేడు ఆ వంశం ఆడబిడ్డ శుద్ధమైన నువ్వు ల నూనె తాగనుంది. స్వరాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి తొడసం వంశీయులు తరలివచ్చారు. ఈ జాతర ఈనెల 30 వరకు కొనసాగనుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి కుటుంబ సమేతంగా నార్నూర్ మండలం మాన్కాపూర్కు చేరుకున్న తొడసం వంశీయులు గోవర్ధన్ గుట్టలో మసెమ దేవతకు సంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సహపంక్తి భోజనాల అనంతరం మండల కేంద్రంలోని ఖాందేవ్ పుణ్యక్షేత్రానికి కాలినడకన బయల్దేరారు. ఖాందేవ్ ఆలయంలోని మర్రిచెట్టుకు ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో తొడసం నాగోరావ్, మెస్రం రూప్దేవ్, మెస్రం శేఖర్ బాబు, తొడసం గోపాల్, బండు,యుర్వేత రూప్దేవ్, నరాం జీ పటేల్, తొడసం బాపురావ్, వంశ పెద్దలు పాల్గొన్నారు.