అంతర పంటలతోనూ అదనపు ఆదాయం
ఏకకాలంలో పలు రకాల దిగుబడులు
వరితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ లాభం
భూసార పరిరక్షణకు పసుపు సాగే మేలంటున్న శాస్త్రవేత్తలు
నిర్మల్ టౌన్, జనవరి 16;ఉద్యానపంటపై విస్తృతంగా అవగాహన ఉమ్మడి జిల్లాలో పుష్కలమైన నీటి వనరులతో పాటు అనుకూలమైన నేలలు ఉండగా, రైతాంగం పసుపు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. ఎకరా వరి వేస్తే రూ. 50 వేల వరకు మాత్రమే మిగులుతుండగా, అదే ఎకరంలో పసుపుతో పాటు అంతర పంటలుగా మక్క, కంది, మిర్చి, పూలు, కూరగాయలు తదితరాలు పండించడం వల్ల నాలుగు రెట్లు అదనంగా ఆదాయం వస్తున్నది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో యంత్రాంగం టెర్మరిక్ సాగుతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రోత్సహిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు నీరు, 24 గంటల ఉచిత కరంట్ ఇవ్వడంతో అనేక మంది రైతులు వరి పంటకే మొగ్గు చూపుతుండగా, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు మాత్రం సంప్రదాయ పంటగా పసుపు(బండారు)ను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఈ ఏడాది 25 వేల ఎకరాల్లో సాగు చేసినట్లు ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పసుపు పంట పండించే జిల్లాల్లో నిర్మల్ ప్రధానమైనది. ఆ తర్వాత ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉంటాయి. పంట సాగుకు ఈ ప్రాంతం నేలలు అనుకూలం. పుష్కలమైన నీటి వనరులు ఉండడం, ఎర్రరేగడి, చలిదుబ్బ నేలలు కావడంతో పసుపు సాగుకు అనుకూలం.
పసుపులో అంతర పంటలతో..
పసుపులో అంతర పంటలుగా మక్క, కంది, మిర్చి.. తదితర వాటిని సాగు చేసుకొని అదనంగా ఆదాయం పొందవచ్చు. అదే ఎకరం భూమిలో మక్క 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాలుకు రూ. 1800 ధర ఉండగా, రూ.36 వేల వరకు ఆదాయం వస్తోంది. కంది 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో క్వింటాలుకు రూ. 6 వేల ధర పలుకుతుంది. ఈ లెక్కన రూ. 30 వేల వరకు ఆదాయం వస్తోంది. ఇక పసుపులో అంతర పంటగా పండించే మిర్చికి మార్కెట్లో డిమాండ్ ఉంది. మిర్చికి కిలోకు రూ. 300 వరకు ధర పలుకుతోంది. మిర్చి 100 కిలోల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రూ. 30 వేల ఆదాయం వస్తోంది. పూలు, కూరగాయల సాగుతో అదనంగా రూ. 15 వేల దాకా మిగులుతాయి. ఏకకాలంలో పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేయడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. మరోవైపు కేంద్రం వడ్లు కొనేది లేదని తెగేసి చెప్పడంతో యంత్రాంగం పసుపు సాగుతో కలిగే లాభాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది.
పసుపు సాగు వల్ల భూసార పరిరక్షణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పసుపును ఇక్కడి రైతులు సంప్రదాయ పంటగా ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎర్రరేగడి, చలిదుబ్బ భూములు ఉండడంతో ఈ పంటకు ఎంతో అనుకూలం. ఈ భూముల్లో దుంప పెద్దగా తయారు అవుతుంది. ఎకరాకు దిగుబడి 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు వస్తోంది. పసుపులో అంతర పంటలు వేసుకోవడం వల్ల ఏకకాలంలో దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దీనిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.