30వ తేదీ వరకు నిర్వహణ
ముందుగా తొడసం వంశీయుల పూజలు
రలిరానున్న భక్తులు
కొవిడ్ నిబంధనలు అమలు
నార్నూర్, జనవరి 16 : నార్నూర్ మండల కేంద్రం శివారులో ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. నేటి నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొడసం వంశీయులు దైవమూర్తులను గంగాజలంతో అభిషేకం చేసి, సంప్రదాయ పూజలు చేసిన అనంతరం జాతరను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. 12 రోజుల పాటు జాతరను నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
మాన్కాపూర్లో పూజలు..
నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలోని గోవర్ధనగుట్టకు తొడసం వంశస్తులు కు టుంబ సమేతంగా ఎడ్లబండ్లపై చేరుకుంటా రు. ఇక్కడ కొలువుదీరిన మర్రిచెట్టు, మైసమ్మ దేవతకు సంప్రదాయ పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. అక్కడి నుంచి దేవుళ్లతో ఖాందేవ్ పుణ్యక్షేత్రానికి కాలినడకన చేరుతారు.
నేడు దైవమూర్తుల ప్రతిష్ఠాపన…
కాగా, ఖాందేవ్ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం దైవమూర్తుల ప్రతిష్ఠాపనను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి తొడసం వంశీయుల ఆచారం ప్రకారం మహాపూజతోపాటు గంగాజలంతో దేవుళ్లకు అభిషేకం చేసి జాతరను ప్రారంభిస్తారు.
ఆడబిడ్డ తైలం తాగడం ఆచారం…
జాతర సందర్భంగా ఆ వంశం ఆడబిడ్డ నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తున్నది. 18న తొడసం జంగుబాయి-సోనేరావ్ దంపతుల బిడ్డ మడావి ఏత్మాబాయి విశ్వశాంతిని కోరుతూ నువ్వుల నూనె సుమారు 2 లీటర్లు తాగనుంది. మూడేళ్లు ఈ ఆడబిడ్డకు తాగిస్తారు. అనంతరం మరొకరికి అవకాశం ఇస్తారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అదే రోజు మధ్యాహ్నం తొడసం వంశస్తుల భేటింగ్(దర్భార్)ఉంటుంది.
కరోనా నిబంధనలు అమలు..
కరోనా వ్యాప్తి దృష్టా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఖాందేవుడిని దర్శించుకునేలా ఏర్పా ట్లు చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటి స్తూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు కోరుతున్నారు.