రూపుదిద్దుకుంటున్న సహజ సిద్ధమైన ప్రాంతాలు
గండి రామన్న హరితవనం అభివృద్దికి రూ.2 కోట్లు
రూ.1.50 కోట్లతో పార్కు చుట్టూ ఫెన్సింగ్
మిగతా నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు
నిర్మల్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగానే హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కోట్లాది మొక్కలను నాటించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలనూ తీసుకుంది. ఓ వైపు హరితహారాన్ని చేపడుతూనే మరో వైపు అటవీ సంపదను కాపాడుతూ వచ్చింది. పట్టణాలకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అడవులను అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేసింది. దీంతో అవి పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్తో పాటు ఖానాపూర్లో ఈ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రాగా… భైంసాలో త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. మంత్రి ప్రత్యేక చొరవతో సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ ఆలయ సమీపంలో ఉన్న అటవీ క్షేత్రంలో సైతం నందనవనం పేరుతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్షేత్రంలో అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సేదతీరేందుకు అవసరమైన షెడ్లు, ప్లాట్ఫాంలు నిర్మించారు. ఖానాపూర్లో అర్బన్ పార్క్ అభివృద్ధి కోసం ఇప్పటిదాకా రూ.55 లక్షలు వెచ్చించారు. పార్క్ చుట్టూ ఫెన్సింగ్ పనులు పూర్తి కాగా, వాకింగ్ ట్రాక్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. నిర్మల్ శివారులోని చించోలి(బీ) ప్రాంతంలో గండి రామన్న హరితవనంలో సందర్శకులను ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతిస్తున్నారు. స్వయంగా అటవీ మంత్రి ఇలాఖాలో రూపుదిద్దుకున్న ఈ పార్కు నిర్మల్ వాసులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. పార్క్ విస్తరణతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇటీవలే మరో రూ.2కోట్లను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో పర్యాటకులు రాత్రిపూట ఇక్కడ విడిది చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు మధ్యభాగంలో పర్యాటకులు బస చేసేందుకు కుటీరాల నిర్మాణాలను ప్రారంభించారు. ఇవి పూర్తయితే ప్రకృతి ప్రేమికులకు దట్టమైన అడవిలో రాత్రంతా గడిపిన అనుభూతి కలుగనున్నది. ఇటీవలే ఇక్కడి పార్కులో జంగిల్ సఫారీని ప్రారంభించారు. వన్యప్రాణులను కాపాడేందుకు పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.1.50 కోట్లను ఖర్చు చేస్తున్నారు. అడవిలో ఖాళీ స్థలాలను గుర్తించి 70వేల మొక్కలను నాటిస్తున్నారు. ఇక్కడి పార్కులో ఇప్పటికే ఒక వాచ్ టవర్ ఉండగా, కొత్తగా రూ.7 లక్షలతో ఎత్తయిన కొండపై మరోటి నిర్మించారు. సందర్శకులు ఈ టవర్పై నుంచి చూస్తే పచ్చని అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది. చిరుత, పెద్దపులి, అడవిదున్న, ఎలుగుబంటి వాటి పేర్లతో సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నారు. సాహస క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఇక్కడి పార్కు ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మారనున్నది.