ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటికే వస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 45, 49 వార్డుల్లో ఆదివారం చైర్మన్ ఇంటింటికీ తిరుగుతూ కౌన్సిలర్లతో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభృవృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. ఆదిలాబాద్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారి సతీశ్, వెనగంటి ప్రకాశ్, నాయకులు పాశం రాఘవేంద్ర, సంతోష్, రాము, ఆర్ఐ చౌహాన్ శశికళ, తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
జైనథ్, జనవరి 16 : యువత క్రీడల్లో రాణించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. మండలంలోని మాకొడ గ్రామంలో స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి బహుమతి ఎమ్మెల్యే జోగు రామన్న తరఫున రూ.25 వేలు , రెండో బహుమతి తను రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, నాయకులు రమేశ్, అశోక్, వెంకన్న, రాంరెడ్డి, వెంకట్రెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మల స్వామిరెడ్డి పాల్గొన్నారు.