నిర్మల్ అర్బన్, జనవరి 16 : థర్డ్ వేవ్పై జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని చర్యలూ చేపడుతున్నారు. జిల్లాలో సగటున రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వైద్యాధికారుకు సూచించారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లా దవాఖానలోనే అన్ని వసతులు..
జిల్లాలో పేదల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారు ప్రైవేట్ దవాఖానకు వెళ్లకుండా, నయాపైసా ఖర్చు కాకుండా వైద్యం అందించేందుకు జిల్లా ప్రధాన దవాఖానలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొవిడ్ బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, అత్యవస ర పరిస్థితిలో ఐసీయూ, వెంటిలేటర్ను సిద్ధం చేశారు. జిల్లా దవాఖానలో ఇప్పటికే 100 ఆక్సిజన్ బెడ్లు, 20 ఐసీయూ బెడ్లు, 10 వెం టిలేటర్లను అందుబాటులో ఉంచారు. భైంసా ఏరియా దవాఖానలో 100 ఆక్సిజన్ బెడ్లు, 10 ఐసీయూ పడకలను సిద్ధం చేశారు. ఖానాపూర్ ఏరియా దవాఖానలో కొవిడ్ రోగుల కోసం 30 బెడ్లను ఏర్పాటు చేశారు.రోగుల సంఖ్య పెరిగినా ఇబ్బందులు తలెత్తకుండా అదనపు గదులను సైతం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్లు, ఆక్సిజన్, వెంటిలేటర్, టీ డయాగ్నోస్టిక్ సేవలను మంత్రి ఐకే రెడ్డి నిర్మల్ జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదటి, రెండో వేవ్లో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో జిల్లా దవాఖానలో హుటాహుటిన అదనపు బెడ్లను ఏర్పాటు చేశారు. రోగులకు వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అందరూ ఆరోగ్యవంతులు కాగానే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవద్దనే ఉద్దేశంతో థర్డ్ వేవ్పై అప్రమత్తమయ్యారు. జిల్లా దవాఖానలో అన్ని ఓపీ సేవలు, సర్జరీలతో పాటు కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించనున్నారు.
అందుబాటులో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్..
కొవిడ్ వైరస్ను నిర్ధారించేందుకు వైద్యాధికారులు రెండు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. కొవిడ్ అనుమానిత లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి స్వాబ్ ( ముక్కు నుంచి) ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా కచ్చితమైన ఫలితం రావడం లేదు. ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కీలకంగా మారింది. ఈ పరీక్ష ద్వారా వైరస్ను కచ్చితంగా నిర్ధారించి రోగికి వైద్యం అందించే వీలు కలుగుతున్నది. గతేడాది ఆగస్టు 15న రూ.1.50 కోట్లతో ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుల కేంద్రాన్ని జిల్లా దవాఖానలో ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని గంటల్లోనే కచ్చితమైన రిపోర్టు వైద్యులకు అందడంతో సకాలంలో మెరుగైన చికిత్స అందుతుంది. ఆక్సిజన్ లేని కారణంగా రోగులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న ప్లాంట్ను రెండు నెలల క్రితం ప్రారంభించారు. దీంతో రోగులకు పుష్కలంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంది. తక్కువ సమయంలోనే ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం కలిగేలా ప్రభుత్వం తీర్చిదిద్దిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సేవలను సద్వినియోగం చేసుకోండి..
థర్డ్ వేవ్ నేపథ్యంలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాట్లు చేశాం. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. కొవిడ్ వ్యాధిగ్రస్తుల కోసం జిల్లా దవాఖానలో బెడ్లను సిద్ధం చేశాం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో జిల్లా దవాఖానలో ఆర్టీపీసీఆర్ టెస్టులు, ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలున్నాయి. ప్రైవేట్ వైద్యశాలల్లో డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ దవాఖాన సేవలను వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తే కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు.