ఉట్నూర్, జనవరి16 : జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. ఉట్నూర్లోని చాలా ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. యువకులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. ఆదివారం కనుమ సందర్భంగా మహిళలు బంధువులకు ఇళ్లకు వెళ్లి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఇచ్చోడ, జనవరి 16: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో రంగురంగుల ముగ్గులతో వీధులు హరివిల్లుగా మారాయి. మహిళలు నోములతో పాటు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో గ్రామాలకు రాకపోకలను సాగించే ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిటకిటలాడాయి.
బోథ్, జనవరి 16: బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ), పొచ్చెర, పట్నాపూర్, కుచులాపూర్, మర్లపెల్లి, కన్గుట్ట గ్రామాల్లో మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. రైతు కుటుంబాల వారు వేసిన ముగ్గుల్లో పండించిన ధాన్యాలు ఉంచి సంక్రాంతికి స్వాగతం పలికారు.
భీంపూర్, జనవరి 16 : మండలంలోని కరంజి(టీ) రామాలయం, అర్లి(టీ), పిప్పల్కోటి, నిపాని వేంకటేశ్వరాలయాలు, గుబ్డి సూర్యగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా కరంజి(టీ), అందర్బంద్ రూట్లలో బస్సులు కిటకిటలాడాయి.
ముగ్గుల పోటీ
ఉట్నూర్, జనవరి16: మండల కేంద్రంలో పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతల ఆధారంగా ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యురాలు అనురాధ, పంచాయతీ ఈవో సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బోథ్, జనవరి 16 : మండల కేంద్రంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 50 ఏళ్లు దాటి 100 ఏళ్లున్న బామ్మలు పోటీలో పాల్గొన్నారు. చుక్కల ముగ్గులు వేస్తూ ఆకట్టుకున్నారు. 98 సంవత్సరాల వయస్సు ఉన్న లంక భూమాబాయి పోటీలో పాల్గొని ప్రత్యేక బహుమతిగా రూ.5వేలు నగదును బోథ్ సీఐ నైలు అందజేశారు. న్యాయ నిర్ణేతలు మంజుల దేశ్పాండే, కత్తూరి సరళ, కే పల్లవి ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించారు. తాళ్ల సుశీల ప్రథమ, కందుల చిన్నమ్మ ద్వితీయ, లత తృతీయ బహుమతి గెలుచుకోగా వీడీసీ చైర్మన్ జీ గంగాధర్, సర్పంచ్ సురేందర్యాదవ్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఎస్ఐ అజయ్ అందజేశారు. కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
పల్లె సంక్రాంతిలోరవికిరణ్
భీంపూర్, జనవరి 16 : ప్రముఖ హోమియో వైద్యుడు, సినీ నిర్మాత, సామాజిక కార్యకర్త డాక్టర్ రవికిరణ్యాదవ్ సంక్రాంతి పండుగను స్వగ్రామం తాంసి వ్యవసాయక్షేత్రంలో జరుపుకున్నారు. సీతాలమ్మ పూజలో పాల్గొన్నారు. కులదైవం ముజ్గి మల్లన్నకు పూజలు చేసి పల్లకీ మోశారు.