ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: స్వచ్ఛ పట్టణంగా మార్చడంలో ప్రజలను భాగస్వాములను చేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో మెరుగైన ర్యాంకు సాధించమే లక్ష్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఇంటిలోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
కమిటీల ఏర్పాటు
ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో 49 వార్డులకు గాను వార్డుకు 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 15మంది చొప్పున ప్రతి వార్డుకు 60 మందిని ఇన్చార్జిలుగా నియమించారు. వారికి తోడుగా మహిళా సంఘాల సభ్యులను నియమించారు. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛ సర్వేక్షణ్ ఉద్దేశాన్ని వివరించి భాగస్వాములను చేస్తున్నారు.
వేర్వేరుగా తడి, పొడి చెత్త
పట్టణంలోని పలు కాలనీల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బంది సేకరిస్తారు. కాలనీలో సేకరించిన తడి, పొడి చెత్తను ఆటోల ద్వారా డంప్యార్డుకు తరలిస్తారు. పట్టణంలోని రహదారుల గుండా చెత్తను వేయకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దుకాణాల వద్ద చెత్త పడితే యజమానికి రూ.5వేల వరకు జరిమానా విధించనున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు. అలాగే ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించారు.
చెత్త బుట్టల పంపిణీ
రెండేళ్లుగా పట్టణంలోని కాలనీల్లో ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేస్తున్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇచ్చిన బుట్టల్లోనే వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. అలాగే చెత్తను తప్పనిసరిగా మున్సిపల్ వాహనాల్లో వేయాలని సూచిస్తున్నారు. అలాగే కాలనీల వారిగా రిసోర్స్ పర్సన్లు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.