సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జనవరి 14: పట్టణంలో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బంగారిగూడలోని డంప్ యార్డును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డంప్ యార్డులో గోశాల, యానిమల్ కేర్సెంటర్, డీఆర్సీసీ సెంటర్, వర్మీకంపోస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీధి కుక్కల బెడద తొలగించేందుకు యానిమల్ కేర్సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారులపై తిరిగే పశువులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని సంరక్షించేందుకు గోశాలను సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పట్టణంలోని తడి,పొడి చెత్తను డంప్ యార్డుకు తరలించి ఎరువులు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల సమస్యలన్నింటినీ ప్రణాళిక ప్రకారం పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రైతబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఉన్నారు.