సంస్కృతీసంప్రదాయాలకు నిలువుటద్దం
ఇప్పటికే ప్రారంభమైన జంగుబాయి జాతర
తాజాగా నాగోబా జాతర కార్యక్రమాలు షురూ
గంగాజలానికి బయల్దేరిన మెస్రం వంశీయులు
తరలిరానున్న పలు రాష్ర్టాల భక్తులు
ఆదిలాబాద్, జనవరి 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జాతరల సందడి మొదలైంది. తమ సంస్కృతీసంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ జాతరలను గిరిజనం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. ఏటా పుష్యమాసంలో ఈ జాతరల కోలాహలం కనిపిస్తుంది. తెలుగు రాష్ర్టాల నుంచేగాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తజనం తరలిరానుండగా, ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏటా వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి పంటల సాగులో బిజీగా గడిపే గిరిజ నులు పుష్యమాసంలో వచ్చే జాతరలకు మాత్రం ప్రాధాన్యమి స్తారు. ఈ జాతరల్లో తమ దేవతలకు పూజలు చేయడం, ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం, తమను చల్లగా చూడమని వేడుకోవడం, జాతర పరిసరాల్లో సేద తీరడం, తమ దూరపు బంధువులను కలుసుకోవడం చేస్తారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం బీమల్పేన్, సిర్పూర్ (యు) మండలంలో మహాదేవ్, ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర, నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర, జంగుబాయి గుహల్లోని దేవుళ్లు, ఉట్నూర్ మండలం శ్యాంపూర్లో బుడుందేవ్ గిరిజనులకు ఆరాధ్య దేవతలు. ఈ మాసంలో గిరిజనులు పొలిమేర పండుగతో పాటు గ్రామ దేవతలైన పెర్సపేన్, భీందేవరలకు పూజలు నిర్వహించి జంగుబాయికి పూజలు చేస్తారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల కు చెందిన గిరిజనులు ఈ జాతరలకు హాజరై పూజలు నిర్వహిస్తారు. మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన జాతరైన కెస్లాపూర్ నాగో బా సందడి ప్రారంభ మైంది. జాతరలో భాగంగా సేకరిం చే గంగాజాలాన్ని సేకరించ డానికి కాలిబాటన మెస్రం వంశీయులు కాలిబా టన బయలుదేరారు.
చీకటి గుహల్లో భీమల్పేన్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కప్లాయి చీకటి గుహలో ఆదివాసీ గిరిజనులు ఏటా భీమదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వేడుకల్లో భాగంగా ఐదోరోజులు దీపారాధన చేస్తూ, అనంతరం పల్లెల్లో భీమదేవుని ఉత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామంలో తమ పూజారి ఇంట్లో ఉన్న భీమదేవుడికి పూజలు నిర్వహించి గ్రామస్తులు డప్పులు, వాయిద్యాలతో గుహలోకి వెళ్తారు. అక్కడ కోనేరులో స్నానమాచరించిన అనంతరం పూజారులు దేవతలకు పూజలు నిర్వహిస్తారు. పుష్యమాసం వరకు ఇక్కడ భక్తుల రద్దీ కొనసాగుతుంది. గోండు, ప్రధాన్, కొలాం తెగకు చెందిన ఆదివాసులు దర్శించుకుంటారు.
మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా దేవత మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం. ఈ జాతర ప్రారంభానికి 25 రోజుల ముందుగానే మెస్రం గిరిజనులు ఏర్పాట్లను ప్రారంభిస్తారు. మహాపూజ కోసం నిర్వహించే గంగాజలం తీసుకువచ్చేందుకు రావాలంటూ మెస్రం వంశీయులు గ్రామాల్లో ప్రచారం రథంలో తిరుగుతూ వారం రోజులు ఆహ్వానిస్తారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం హస్తినమడుగుకు కాలినడకన పోయి గంగాజలాన్ని తీసుకువస్తారు. కలశంలో జలంతో కెస్లాపూర్కు చేరుకుంటారు. నాగోబా ఆలయం సమీపంలో ఉన్న మర్రిచెట్ట వద్ద నాలుగు రోజుల పాటు సేదతీరుతారు. పుష్యమాసం అమవాస్య రోజు గంగాజలంతో నాగోబాకు పూజలు నిర్వహిస్తారు. ఇక ఆ రోజు నుంచే జాతర ప్రారంభమవుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు నాగోబాను దర్శించుకుంటారు. ఉట్నూర్ ఐటీడీఏ అధికారులు గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం దర్బార్ను ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటారు.
జంగుబాయి జాతర
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహరాజ్గూడ ప్రాంతంలోని గుహల్లో జంగుబాయి దేవత కొలువై ఉంటుంది. ప్రస్తుతం జంగుబాయి జాతర ప్రారంభమైంది. సహ్యాద్రి పర్వతాల్లో అందాలొలికే సుందర దృశ్యాలు, నీటి ప్రవాహం పక్కన ఉన్న గుహల్లో జంగుబాయి ఆలయం ఉంది. శార్దూల వాహిణి రూపంలో దుర్గాదేవి ప్రతిరూపం జంగుబాయి అని స్థానికులు నమ్ముతారు. ఏటా పుష్యమాసంలో జంగుబాయిని పూజిస్తారు. వారం రోజులుగా ఈ జాతర కొనసాగుతున్నది.