ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఎదులాపురం, అక్టోబర్ 13: ఆదిలాబాద్ నియోజకవర్గలోని ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రతి ఊరికో కుమ్రం సూరు విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివాసీల ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆదివాసీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ముందుగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆదిలాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పులు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో రాష్ట్ర, కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా అని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. కొలాం, గిరిజనులందరికీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ట్రైకార్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఎన్నికలు లేవన్నారు. జోగు ఫౌండేషన్ ద్వారా ప్రతి ఊరికో కుమ్రం సూరు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హక్కుపత్రాలపై ప్రస్తావించారిని గుర్తు చేశారు. రూరల్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలల వివరాలు అందజేయాలని ఆదివాసీ సంఘం నాయకులకు సూచించారు. సమావేశంలో కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సొనేరావ్, కుమ్రం సూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్ర రాజు, ఎంపీటీసీలు కుమ్ర జంగు పటేల్, మాడావి కిషన్, గ్రామ పటేల్ టేకం బాపురావ్, ఆదివాసీ నాయకుడు నైతం శుక్లాల్, కొలాం సంఘం నాయకుడు మాడావి జంగు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుమ్ర మోతీరాం, నాయకులు కుమ్ర వసంత్రావు, మాడావి అశోక్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 13: పట్టణంలోని శాంతినగర్లో నివాసముంటున్న ఎక్బాల్ అలీ కుమారుడు మహ్మద్ ఆలీ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. వారి కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. లాండసాంగిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన అంక సుగుణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడ ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు జగదీశ్, గుండావార్ సంతోష్, రాము, ఇబ్రహీం, నారాయణ పటేల్, గంగన్న ఉన్నారు.
అగ్ని ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం
యాపల్గూడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కట్ట రాజేశ్వర్ కుటుంబానికి ఎమ్మెల్యే జోగు రామన్న రూ.5వేలు అందించారు. ప్రభుత్వం నుంచి డబుల్బెడ్రూం వచ్చేలా చూస్తామన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
జైనథ్, అక్టోబర్ 13: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న బుధవారం మండలంలోని దీపాయిగూడలో పత్తి, సోయాబీన్, కంది పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా దిగుబడి ఎకరాకు ఎంత వరకు వస్తుందని తన స్నేహితులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడు కురిసిన అధిక వర్షాలతో పత్తి, సోయాబిన్ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని వారు ఎమ్మెల్యేకు వివరించారు.