బీజేపీ ఇచ్చిన హామీల అమలు జాడేది?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు
ఎదులాపురం, డిసెంబర్ 11 : సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునః ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో శనివారం సీపీఎం 12వ మహాసభ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా నాయకుడు బండి దత్తాత్రి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తొడసం భీంరావ్, ఆత్రం భగవంత్రావ్, మధవ్రావ్, పీ సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మూతబడిన సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి కావల్సిన ముడిసరుకు జిల్లాలోనే ఉందని తెలిపారు. ఈ పరిశ్రమ తెరిస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీ సుకోవాలని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదన్నారు. బీజేపీ ఎంపీ ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఎం రాష్ట్ర నాయకుడు లంకా రాఘవు లు ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. భవిష్యత్లో పార్టీ, అను బంధ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలపై పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆశ లత, బండారు రవికుమార్, బండి దత్తా త్రి, దర్శనాల మల్లేశ్, అన్నమొల్ల కిరణ్, పుసం సచిన్, లంకా జమున, సునీత, ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.