బోథ్, డిసెంబర్ 11 : వ్యాక్సిన్తోనే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని ఎంపీడీవో సీహెచ్ రాధ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్, వైద్య సిబ్బంది శనివారం ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. బస్టాండ్లో ప్రయాణికులకు టీకా వేయించారు. ఇతర రాష్ర్టాల నుంచి బస్సుల్లో వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇప్పించారు. కార్యక్రమంలో ఎంపీవో జీవన్రెడ్డి, కంట్రోలర్ సాయన్న, వీడీసీ చైర్మన్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్రాలతండా, కౌఠ(బీ) ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను పీహెచ్సీ డాక్టర్ కే నవీన్రెడ్డి పరిశీలించారు.
రెండు డోసులు తప్పనిసరి
నార్నూర్, డిసెంబర్ 11: కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకోవాలని సర్పంచ్ యశ్వంత్రావు, పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ చౌహాన్ చరణ్దాస్ అన్నారు. మహాగావ్తండా, శేక్గూడలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాక్సిన్ వేసుకున్న వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఏ నరేశ్, హెల్త్ అసిస్టెంట్ ఈశ్వర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 11: మండల కేంద్రంలోని మజీద్ గిల్లీలో ప్రభుత్వ వైద్యాధికారి ఆకుదారి సాగర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరగుతూ కొవిడ్ టీకా వేశారు. టీకా వలన ఉపయోగం గురించి వివరించారు. 18ఏళ్లు పైబడిన వారందరికీ ఈ నెల చివరి వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్లు వైద్యాధికారి తెలిపారు.
భీంపూర్, డిసెంబర్ 11: కరంజి(టీ) గ్రామంలో 102 మందికి టీకాలు వేశారు. ఇక్కడ మొత్తం 350 మంది ఉండగా 320 మంది టీకా తీసుకున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని రాజులవాడి గ్రామం కలిపి ఇంకా 30 మందికి ఆదివారం టీకా ఇవ్వనున్నారు. వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేస్తామని ఏఎన్ఎం సుజాత తెలిపారు. సర్పంచ్ జీ స్వాతిక, ఉపసర్పంచ్ లక్ష్మీబాయి, పంచాయతీ కార్యదర్శి నితిన్, అంగన్వాడీ కార్యకర్తలు సునీతరెడ్డి, కవిత పాల్గొన్నారు.
బేల, డిసెంబర్ 11: మండల కేంద్రంతో పాటు దొపటాల గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ టీకా వేశామని ఏఎన్ఎం లలిత తెలిపారు. ఆమె వెంట ఆశకార్యకర్తలు కవిత, అనుసూయ ఉన్నారు.
సిరికొండ, డిసెంబర్ 11 : 18 సంవత్సరాలు నిండిన వారు కొవిడ్ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఉపసర్పంచ్ తొకల చిన్న రాజన్న అన్నారు. మండలం కేంద్రంలో గ్రామస్తులకు టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటన్న, బీజేపీ నాయకుడు సంటి భూమన్న, తదితరులు పాల్గొన్నారు.