కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, ఆగస్టు 11: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ అధికారులు, ఛైర్మన్లతో పట్టణ ప్రగతిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వపరంగా పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులు, పూర్తి చేసిన పనులు, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు నిర్మించుకోవాలని, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, అంకం రాజేందర్, మున్సిపల్ కమిషనర్ అలీం, టౌన్ ప్లానింగ్ అధికారి సుమలత, ఏఈలు నాగేశ్వర్రావు, వినయ్కుమార్ పాల్గొన్నారు.
ఎవెన్యూ ప్లాంటేషన్పై దృష్టి సారించాలి
మామడ, ఆగస్టు 11 : అటవీ, పంచాయతీ అధికారులు ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని బూరుగుపెల్లి, మొండిగుట్టలో బుధవారం ఆయన పర్యటించారు. జాతీయ రహదారికి ఇరువైపులా విరివిగా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అటవీ, పంచాయతీ అధికారులకు సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఎఫ్వో వికాస్ మీన, ఎంపీడీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శులు శ్రావణి, జువేరియా కానమ్, అటవీ సిబ్బంది ఉన్నారు.