ముమ్మరంగా ఈజీఎస్ పనులు
ఇప్పటికే నార్నూర్, గాదిగూడ మండలాల్లో 17,585 మంది కూలీలకు ఉపాధి
2021-22 ఆర్థిక సంవత్సరానికి 7.9లక్షల పని దినాలు లక్ష్యం
ఇప్పటి వరకు 8.35 లక్షల పని దినాలు పూర్తి
నార్నూర్, జనవరి 11 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది గ్రామాల్లో మట్టి రోడ్లు వేయడం, కందకాలు తవ్వడం, పంట పొలాలకు నీటి మళ్లింపు, కాల్వల పునరుద్ధరణ, ఇరువైపులా రాతి కట్టడాలు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలలో పూడికతీత పనులు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కల పంపిణీకి నర్సరీల్లో ఉపాధి కూలీలను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నర్సరీల్లో మొక్కల సంరక్షణ, పెంపకానికి కవర్లలో మట్టి నింపే పనులను కూలీలతో చేయించారు.
112 శాతం లక్ష్యం పూర్తి..
2021-22 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలల్లో నార్నూర్, గాదిగూడ మండలాల వ్యాప్తంగా 13,890 కుటుంబాలకు చెందిన 14,600 మంది కూలీలకు పని కల్పించారు. వీరిలో 1,605 కుటుంబాలు వంద పని దినాలు పూర్తి చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 8.35 లక్షల పని దినాలను మంజూరు చేయగా ఇప్పటికే అన్ని రోజులూ పూర్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.18.35 కోట్లు ఖర్చు చేయగా రూ.14కోట్లు కూలీలకు వేతన రూపంలో చెల్లించారు. రూ.4 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్స్ కింద ఖర్చు చేశారు. రాష్ట్రంలో కూలీలకు ఉపాధి కల్పనలో మూడో స్థానంలో ఉండగా జిల్లాలో 2వ స్థానంలో ఉంది.