నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రూ.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం
అధికారులు, మెస్రం వంశీయులతో సమావేశంలో మాజీ ఎంపీ నగేశ్
ఇంద్రవెల్లి, జనవరి 11 : గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలకు టీఆర్ఎస్తోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆదిలాబాద్ మాజీ ఎంపీ జీ నగేశ్ అన్నారు. కెస్లాపూర్ నాగోబా ఆలయ నిర్మాణ పనులను మంగళవారం దేవాదాయ, ఐటీడీఏ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్బార్ హాల్లో ఇంజినీరింగ్ అధికారులతో పాటు మె స్రం వంశీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రూ.6 కోట్లతో చేపట్టిన వివిధ రకాల పనులు, నాగోబా ఆలయంలో అదనంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అదనంగా చేపట్టే 15 రకాల అభివృద్ధి పనులను అధికారులతో కలిసి శాఖల వారీగా గుర్తించి, రూ.5 కోట్లతో ప్రణాళిక తయారు చేశామన్నారు. సీఎం కేసీఆర్ను త్వరలోనే కలిసి, పనులతోపాటు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. మంజూరైన వెంటనే పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. నాగోబా దర్శనానికి వచ్చే భక్తులతో పాటు మెస్రం వంశీయులకు ఏ సమస్యలూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, ఐటీడీఏ ఈఈ భీంరావ్, దేవాదాయ శాఖ డీఈ రాజేశ్వర్, ఐటీడీఏ ఏఈ సతీశ్, దేవాదాయ శాఖ ఈవో మహేశ్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, మెస్రం వంశీయులు సోనేరావ్, దేవ్రావ్, ఆనంద్రావ్, శేఖర్బాబు, తుకారాం, మెస్రం షేకు, మాజీ ఎంపీపీ కనక తుకారాం, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హన్మంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, కాంట్రాక్టర్ అప్పారావ్, నాయకులు తొడసం దేవ్రావ్, తొడసం సాగర్ పాల్గొన్నారు.