రైతు వేదికలకు మంచి రోజులు
ప్రతినెలా నిర్వహణ పేరిట ఒక్కోదానికి రూ.2వేలు
క్లస్టర్ పేరిట బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న అధికారులు
నిర్మల్ టౌన్, డిసెంబర్ 10 : గ్రామాల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు, వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికలకు మంచిరోజులొచ్చాయి. నిర్మల్ జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా, ప్రభుత్వం ఒక్కో రైతు వేదిక నిర్వహణకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు క్లస్టర్ల పేరిట సమీప బ్యాంకుల్లో ఖాతాలను తెరువాలని ఆదేశించింది. ఇప్పటికే 70 చోట్ల బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించి సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నూతనంగా నిర్మించిన వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రాధాన్యత ఇస్తూనే వ్యవసాయ విస్తీర్ణాధికారులను నియమించగా… ఇప్పుడు ప్రతి క్లస్టర్లో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 79 వ్యవసాయ క్లస్టర్లుండగా.. 79చోట్ల రైతు వేదికల నిర్మాణం అన్ని హంగులతో నిర్మించారు. ఒక్కొక్క వేదికకు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ. 24లక్షల నిధులను మంజూరు చేయడంతో రైతు వేదికల నిర్మాణం పూర్తయి రైతుల విజ్ఞానానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదిక ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పంటల సాగు విధానం, ఆరుతడి పంటలు, యంత్రీకరణ, భూసార పరీక్షలు, తదితర అంశాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూనే ఇంటర్నెట్ సహాకారంతో రైతులు సాధించిన విజయాలను వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతు వేదికల నిర్వహణపై ఇప్పటివరకు స్పష్టత లేకపోగా.. ప్రభుత్వం ఒక్కొక్క రైతు వేదికకు నెలకు రూ. 2వేల చొప్పున నిధులను విడుదల చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. రైతు వేదికల పేరిట ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ల పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశించడంతో 70చోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నేరుగా రైతు వేదికల నిర్వహణకు ఆన్లైన్ ద్వారా ప్రతినెలా రూ.2వేల చొప్పున ఈ ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని జిల్లా వ్యవసాయశాఖ సహాయ అధికారి వినయ్బాబు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ క్లస్టర్ల నిర్వహణ, గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు వేదికలను శుభ్రం చేయడం వంటి పనులను చేపడుతుండగా.. రైతు వేదికలకు కరెంటును ఉపయోగించడంతో మంజూరైన నిధులతో విద్యుత్ బిల్లులు చెల్లించుకునేందుకు అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.