కడెం, డిసెంబర్ 10 : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని టీఎస్ ఎన్పీడీసీఎల్(సీజీఆర్ఎఫ్) వరంగల్ రీజియన్ చైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. కడెం మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయంలో శుక్రవారం ఖానాపూర్ సబ్ డివిజన్ పరిధిలోని కడెం, ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి, మామడ మండలాల విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వరయ్య మండలాల వారీగా వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయానికి సంబంధించి పలువురు వినియోగదారులు వారి సమస్యలను విన్నవించారు. మొత్తం ఐదు మండలాల పరిధిలో 15 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ పరిధిలోని వినియోగదారులు తప్పకుండా నెలవారీగా బిల్లులు చెల్లించాలన్నారు.
ప్రభుత్వం విడుతల వారీగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలకవర్గ సిబ్బందితో భాగస్వాములై గ్రామాల్లోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిచేసినట్లు తెలిపారు. విరిగిన, వంగిన, ఇనుప స్తంభాల స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. అవసరమైన చోట మినీ ట్రాన్స్ఫార్మర్లు, రోడ్డుకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచెలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని ప్రతి సమస్యనూ స్థానిక లైన్మన్ ద్వారా ఏఈల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలవారీ బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని వినియోగదారులకు సూచించారు. అనంతరం కడెంకు వచ్చిన విద్యుత్ ఉన్నతాధికారులను ఆయా మండలాల ఏఈలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ టెక్నికల్ మెంబర్ బీ అశోక్, ఫైనాన్స్ మెంబర్ ఎల్ కిషన్, మెంబర్ ఇండిపెండెంట్ ఎస్ భూమారెడ్డి, కన్వీనర్ జీ మధుసూదన్, ఖానాపూర్ ఏడీఈ ఈదన్న, కడెం, దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి, మామడ మండలాల ఏఈలు సుమన్కుమార్, కేశెట్టి శ్రీనివాస్, లచ్చన్న, సాయికిరణ్, తిరుపతి, విద్యుత్ సిబ్బంది, అయా గ్రామాల వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
డీటీఆర్ మంజూరు చేయాలి..
నచ్చన్ఎల్లాపూర్ గ్రామంలోని పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయం పక్కన కాలనీకి నూతనంగా 25 కేవీఏ డీటీఆర్ను మంజూరు చేయాలని కోరుతూ చైర్మన్ ఈశ్వరయ్యకు సర్పంచ్ గంగన్న వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం అక్కడ 15 కేవీఏ డీటీఆర్ ఉన్నదని, గృహ వినియోగదారులకు సరిపోక లోడ్ పడుతున్నదని పేర్కొన్నారు. 25 కేవీఏను ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని తెలిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. వీడీసీ అధ్యక్షుడు జాడి రాజన్న, గ్రామస్తులు భుక్యా కిషన్నాయక్, గంధం గంగయ్య, ఊరే రవి, లసెట్టి లక్ష్మణ్, గంధం వెంకన్న, ఇస్లావత్ గోవింద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.