పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్
ఉట్నూర్ డివిజన్లో 99 శాతం పోలింగ్
ఉట్నూర్, డిసెంబర్ 10 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉట్నూర్లో ప్రశాంతంగా జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 42 మంది ఓటర్లు ఉండగా 41 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 99 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రిసైడింగ్ అధికారి ఇమ్రాన్ఖాన్ తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్తో పాటు ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్ మండలాల్లోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నార్నూర్ మండలం రాజులగూడ ఎంపీటీసీ ఒకరు ఓటు వేయకపోవడంతో 99 శాతం పోలింగ్ నమోదైంది. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో 60 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఏఎస్పీ హర్షవర్ధన్, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీటీసీలు
బోథ్, డిసెంబర్ 10: ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహించిన పోలింగ్లో బోథ్ మండలానికి చెందిన ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీపీ తుల శ్రీనివాస్, వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, ఎంపీటీసీలు శిరీషరెడ్డి, జమునారాణి, అమరావతి, రజియాబేగం, రాజమణి, రజని, సునీత, నారాయణరెడ్డి, మణిందర్సింగ్, శంభు, మహేందర్, జుగదిరావ్ జిల్లా కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ భారీ మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు.