ఎదులాపురం, జనవరి 10 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూత్లిబౌలి పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధనతో కలిసి డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు టీకా తీసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న బూస్టర్ డోస్ను అర్హులందరూ వేసుకోవాలని డీఎంహెచ్వో సూచించారు. జిల్లా వ్యాప్తంగా 5,52,949 మంది మొదటి డోసు తీసుకోగా.. 3,51,462 మంది రెండో డోస్ వేసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా రెండు డోస్లు తీసుకొని 9 నెలలు నిండిన వారికే ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులున్న 60 ఏండ్లు పైబడిన వారు వైద్యుల సలహా మేరకు టీకా తీసుకోవాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ జాదవ్ వినోద్, సీవో నవీన్ కుమార్, వైద్య సిబ్బంది లీల, అన్నపూర్ణ, తేజ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్లో 9 లక్షల మందికి..
నిర్మల్ చైన్గేట్, జనవరి 10 : జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ ప్రారంభమైనట్లు నిర్మల్ డీఎంహెచ్వో ధన్రాజ్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 9 లక్షలకు పైగా మంది వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. 15 నుంచి 18 ఏండ్ల మధ్య 22 వేల మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. రెండో డోస్ పూర్తిచేసుకున్న హెల్త్వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.