నిర్మల్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఎవుసాన్ని పండుగలా మార్చింది. రైతు ఎలా చనిపోయినా ఆ కుటుంబానికి అండగా నిలువాలన్న ఉద్దేశంతో రైతు బీమా అమల్లోకి తెచ్చింది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తూ, ప్రీమియం భారాన్ని కూడా భరిస్తున్నది. రైతు మరణిస్తే, బాధిత కుటుంబానికి ఎల్ఐసీ ద్వారా 5 లక్షలు చెల్లిస్తూ, భరోసా ఇస్తున్నది. నిర్మల్ జిల్లాలో 1,10, 349 మంది అన్నదాతల కుటుంబాలకు ప్రీమియం కట్టింది. ఇప్పటివరకు 2978 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, మొత్తంగా రూ. 148.90 కోట్ల బీమా పరిహారం వారి ఖాతాల్లో జమ చేసింది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతుబంధు పథకం ద్వారా ఏటా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అలాగే రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతుబీమా ద్వారా ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రూ.5 లక్షలను అందజేస్తూ బతుకుపై భరోసానిస్తున్నది. కాగా ఈ యేడాది కూడా రైతు బీమా కోసం కొత్త పట్టాదారులకు అవకాశం కల్పించేందుకు వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 10,154 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులతో పాటు, గతంలో ఎవరైనా బీమాకు దరఖాస్తు చేసుకోని రైతుల కోసం జూలై 11 నుంచి ఈ నెల 5 వరకు అవకాశం కల్పించారు. అయితే కొత్తవారితో పాటు, గతంలో నమోదైన 1,00,195 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు రెన్యువల్ చేయనున్నది. జిల్లాలో 2017-18నుంచి ఈ రైతుబీమా పథకం అమలవుతుండగా, ఏటా ఆగస్టు 14 నుంచి మరుసటి ఏడాది ఆగస్టు 13 వరకు బీమా వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కో రైతు పేర ప్రీమియాన్ని చెల్లిస్తున్నది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఒక్కో రైతు పేరుమీద రూ.3,556 ప్రీమియాన్ని చెల్లించింది. జిల్లాలో 1,75,600 మంది రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న 1,00,195 మంది రైతులకు బీమా వర్తిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా మరో 10,154 మంది రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్పుస్తకంతో పాటు నామినీ వివరాలను సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి వద్ద నమోదు చేయించుకున్నారు. దీంతో ఈ ఏడాది రైతుబీమా కోసం మొత్తం 1,10,349 మంది రైతులకు ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనున్నది.
జూన్ 18లోపు పట్టా పాస్పుస్తకాలు పొందినవారికే…
కాగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులకు జూన్ 18 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ 18వ తేదీ లోపు పట్టా పాస్పుస్తకాలు తీసుకున్న వారికి అవకాశం కల్పించారు. అప్పటి వరకు జిల్లాలో పోడు భూముల పట్టాలు పొందిన వారు సైతం రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,986 మంది రైతులకు పోడు పట్టాలు ఇవ్వగా, వీరిలో అర్హులైన 8699 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో కలిపి మొత్తం 10,154 మందిని కొత్తగా రైతుబీమాకు అర్హులుగా గుర్తించారు.
ఐదేండ్లలో రూ.148.90 కోట్ల సాయం..
రైతు కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతు కుటుంబాల్లోని పెద్దదిక్కు మరణిస్తే వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి కుటుంబాలను అప్పుల బారి నుంచి కాపాడడమే కాకుండా బాధిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆదుకుంటున్నారు. ఈ పథకం కింద నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు గత ఐదేండ్లలో 2978 మంది రైతులు మరణించగా, సంబంధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున 148.90కోట్లను అందజేశారు. రైతు కుటుంబాలకు మొదట్లో రూ.5 లక్షల బీమా డబ్బులను బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం, తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నది. కాగా ఈ పథకాన్ని 2018 పంద్రాగస్టున సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుంచి 2018 లో 545మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.27.25 కోట్లను అందజేసింది. అలాగే 2019లో 512 మంది రైతులకు రూ.25.65 కోట్లు, 2020లో 694 మంది రైతులకు రూ. 34.70 కోట్లు, 2021లో 613 మంది రైతులకు రూ.30.65 కోట్లను, 2022లో 570 మందికి 28.50 కోట్లు, 2023లో ఇప్పటి వరకు 44 మంది రైతులకు రూ.2.20 కోట్లను సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,75,600 మంది రైతులు ఉండగా, వీరిలో ఈ ఏడాది 1,10,349 మంది రైతులు రైతు బీమాకు అర్హులుగా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. దీంతో ఈ యేడాది రైతు బీమా కోసం సుమారు రూ.39.24 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించనున్నది.
1,10,349 మంది రైతులు అర్హులు..
ఏటా ఆగస్టు 14 నుంచి మరుసటి ఏడాది ఆగస్టు 13 వరకు రైతు బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది కాలంలో కొత్తగా ధరణిలో పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం ఈ నెల 5 వరకు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. కొత్తగా 10,154 మంది రైతు బీమాకు అర్హత పొందారు. పాతవారితో కలిపి మొత్తం 1,10,349 మంది ఉన్నారు. కొత్త రైతులతో పాటు పాత రైతుల వివరాలను ఎన్రోల్ చేశాం. వీరందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.
–అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్