ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించాలి..
366 మంది వైద్య సిబ్బందిని నియమించండి..
రూ.20 కోట్లు విడుదల చేయాలి
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
ఆదిలాబాద్, మే 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్లో కరోనా నివారణలో భాగంగా మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం వాటాగా రూ.20 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, 366 మంది వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కరోనాతోపాటు ఇతర వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు కరోనాతో పాటు ఇతర వైద్య సేవలు మెరుగు పర్చడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన 250 పడకల రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. దవాఖాన ప్రారంభంలో భాగంగా ప్రభుత్వ వాటా రూ. 20 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందించడానికి అవసరమైన 366 మంది డాక్టర్లు, ఇతర సిబ్బంది వెంటనే నియమించాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో సీఎం కేసీఆర్ తమకు అండగా నిలుస్తున్నారని అంటున్నారు.
సూపర్ స్పెషాలిటీతో మెరుగైన సేవలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఆదిలాబాద్లో రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మించింది. ప్రస్తుతం రిమ్స్లో ప్రజలకు కరోనాతో పాటు పలు రకాల సేవలు అందుతుండగా ఈ వైద్యశాల నిర్మాణంతో అన్ని రకాలు వ్యాధులకు చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు సమీపంలో ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 3.4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. రూ.150 కోట్లతో చేపట్టిన ఈ దవాఖానకు రూ.80 కోట్లు భవనాలకు, రూ. 70 కోట్లు వైద్య పరికరాల కొనుగోలు, ఇతర అవసరాలకు వెచ్చించారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో 8 వివిధ వ్యాధులకు సంబంధించి 220 పడకలు అందుబాటులో ఉంటాయి. న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, సీటీవీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీటితో పాటు రేడియాలజీ విభాగంలో సీటీస్కాన్, ఎక్స్రే, మెనోగ్రాఫీ, అల్ట్రాసౌండ్ లాంటి సౌకర్యాలు వస్తాయి. జిల్లా ప్రజలు పలు రకాల వ్యాధుల చికిత్స కోసం కరీంనగర్, నిజమాబాద్, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్పూర్, యావత్మల్, వరదా లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి నెలా పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఉమ్మడి జిల్లా వాసులకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందనున్నాయి.