ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన
రామకృష్ణాపూర్, డిసెంబర్ 8: ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రెండో వార్డులో జీటీ హాస్టల్ పక్కననున్న సుమారు మూడెకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం విప్ బాల్క సుమన్ మున్సిపల్ కమిషనర్తో కలిసి బుధవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీటీ హాస్టల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసంత మధ్యలో ఉన్న స్థలం పట్టణ ప్రజలకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులోనే ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్, ఫిష్ మార్కెట్ను అత్యంత ఆధునిక హంగులతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణను ఆదేశించారు. అంబేద్కర్ వార సంత స్థలాన్ని అంబేద్కర్ యువజన సంఘం వారికే వదిలివేయాలని సూచించారు. రెండో వార్డులోని జ్యోతినగర్, తిలక్నగర్ మధ్యలోని సుమారు 10 ఎకరాల స్థలంలో బృహత్ పట్టణ ప్రకృతి వనం, యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. దానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని కమిషనర్, మున్సిపల్ ఏఈ అచ్యుత్ను ఆదేశించారు. రామాలయం ముందుభాగంలోని సంత పక్కనున్న 10 ఎకరాల స్థలం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాల క్రితం నాటిన ఏడాకుల పాల చెట్లను తొలగించాలని ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ను కోరుతానని తెలిపారు. వాటి స్థానంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో విప్ను సన్మానించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆసాల రాజన్న కుమార్తె పద్మశ్రీ, వెంకటేశ్ నిశ్చితార్థానికి హాజరయ్యారు. కమిషనర్ వెంకటనారాయణ, ఏఈ అచ్యుత్, వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, ఎండీ యాకూబ్అలీ, గోపురాజం, వార్డు కౌన్సిలర్ సుధాకర్, గడ్డం సంపత్, రేవెల్లి ఓదెలు, నాయకులు చంద్రమోహన్, పందిన కృష్ణ, గడ్డం రాజు, ఎర్రబెల్లి రాజేశ్, వేనెంక శ్రీనివాస్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న విప్..
జైపూర్, డిసెంబర్ 8 : మండలకేంద్రంలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, దాతల సహకారంతో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ బాల్క సుమన్ హాజరై ప్రత్యేకపూజలు చేశారు. విప్కు నిర్వాహకులు జ్ఞాపిక అందించి శాలువాతో సన్మానించారు. సర్పంచ్ ఆసంపల్లి సువర్ణ, ఎంపీటీసీ రాంటెంకి లింగస్వామి, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ గోదారి రమాదేవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రిక్కుల మధూకర్రెడ్డి, సురేందర్రెడ్డి, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నూతన గృహ దర్వాజ ప్రతిష్ఠాపన
రామకృష్ణాపూర్, డిసెంబర్ 8 : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి (కుర్మపల్లి)లో నిర్మిస్తున్న స్వగృహానికి బుధవారం విప్ బాల్క సుమన్ దర్వాజ ప్రతిష్ఠాపన చేశారు. గృహ నిర్మాణం పూర్త్తయిన తర్వాత ఇక్కడి ప్రజల్లో ఒకడిగా ఉంటానని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్రెడ్డి, పార్టీ సమన్వయ కర్త అబ్దుల్ అజీజ్, మాజీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, కో-ఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీ, రామిడి కుమార్, జే కుమార్, కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిలకర మహేశ్, రేవెల్లి ఓదెలు పాల్గొన్నారు.
‘డబుల్’ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి
మందమర్రి, డిసెంబర్ 8: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని విప్ బాల్క సుమన్ ఆదేశించారు. మందమర్రి పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బుధవారం ఆయన పరిశీలించారు. నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు మున్సిపాలిటీలో రూ.31 కోట్లతో 586 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్మాణాల్లో వేగం పెంచాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.